హితకారిణి విద్యా సంస్థల విలీనానికి కృషి
ABN , First Publish Date - 2021-04-17T05:24:13+05:30 IST
సంఘ సంస్కర్త యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి విద్యాసంస్థలను విద్యాశాఖలో విలీనం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు.
- ఎంపీ మార్గాని భరత్రామ్.. కందుకూరి వీరేశలింగం జయంతి
- సంఘసంస్కర్తకు పలువురి ఘన నివాళులు
గోదావరి సిటీ, (రాజమహేంద్రవరం) ఏప్రిల్ 16: సంఘ సంస్కర్త యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి విద్యాసంస్థలను విద్యాశాఖలో విలీనం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. వీరేశలింగం జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఎస్కేవీటీ కళాశాల ఆనంద గార్డెన్స్లో కందుకూరి దంపతుల సమాధుల వద్ద ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కందుకూరి ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. ఐదు నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయని ఆయా సంస్థల సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నగర అర్బన్ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ కందుకూరికి నివాళులు అర్పించారు. పీవీబీ సంజీవరావు, మన్నే ఉమాదేవి, బిల్డర్ చిన్న పాల్గొన్నారు. స్థానిక నివేదిత కిషోర్ విహార్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కందుకూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పిన వీరేశలింగం మాటలను హెచ్ఎం వరహగిరి కృష్ణమోహన్ గుర్తుచేశారు. కందుకూరి పురమందిరంలో టౌన్హాల్ ట్రస్టీ, వైసీపీ మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు కందుకూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన యావదాస్తిని స్త్రీ జనోద్ధారణకు ఖర్చుచేసిన గొప్ప సంఘసంస్కర్త కందుకూరి అని, ఆయన ఆస్తులను చరిత్రను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ట్రస్టుబోర్డు సెక్రటరీ రామారావు, ట్రస్టీ అసదుల్లా అహ్మద్, సుబ్బారావు పాల్గొన్నారు. కందుకూరి జన్మగృహంలో పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.తిమ్మరాజు కందుకూరి కాంస్య విగ్రహానికి, చిత్రపటానికి నివాళులర్పించారు. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, రాయల్ మాస్క్ ట్రస్టీ కరీమ్, సిబ్బంది ఎండి మూసా, రంగనాయకులు పాల్గొన్నారు.