‘యాప్‌’ సోపాలు!

ABN , First Publish Date - 2022-08-17T06:49:05+05:30 IST

జిల్లాలో ఉపాధ్యాయులు తమ హాజరును నేరుగా పాఠశాలల్లో హాజరు పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం ఈ విధానాన్ని పక్క నపెట్టింది.

‘యాప్‌’ సోపాలు!

రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వేలాది మంది ఉపాధ్యాయులకు  హాజరు కష్టాలు వెన్నాడుతున్నాయి. జిల్లాలో మంగళవారం నాడు సెల్‌ఫోన్‌లో ప్రభుత్వ సిమ్స్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా అది పనిచేయకపోవడంతో చుక్కలు కనిపించాయి. ఉదయం పాఠశాలకు వచ్చినప్పటి నుంచి మఽధ్యాహ్నం వరకు ఎంత ప్రయత్నించినా హాజరు పని కాలేదు. దీంతో తొలిరోజు ప్రభుత్వం చెప్పిన సెల్‌ఫోన్‌ హాజరు విఫలమైంది. జిల్లావ్యాప్తంగా అయిదు శాతం కూడా యాప్‌ హాజరు నమోదవలేదు. కాగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయులు ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయలేదు. తమ సెల్‌ఫోన్‌ నుంచి హాజరు నమోదు చేసి పంపించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. అటు హైస్కూళ్లలో మాత్రం పైఅధికారుల ఒత్తిడితో కొందరు  సిమ్స్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినా దానిని వినియోగించకుండా  నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు యాప్‌ను తెరిచినా పనిచేయకపోవడంతో నరకయాతన పడ్డారు. గతంలో చలో విజయవాడ ఉద్యమం విజయవంతం కావడంతో కక్షబూని ప్రభుత్వం యాప్‌ హాజరుతో వేధిస్తోందని, సీపీఎస్‌ ఉద్యమాన్ని సైతం అణచివేయడానికే ఈ విధానాలతో భయపెట్టడానికి చూస్తోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో జిల్లాలో ఉపాధ్యాయులకు హాజరు కష్టాలు

తొలి రోజే పనిచేయకుండా చతికిలబడ్డ ప్రభుత్వ సిమ్స్‌ యాప్‌

సెల్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినా పనిచేయక ఉపాధ్యాయులకు నరకయాతన

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సెల్‌ఫోన్‌తో పాట్లు అన్నీఇన్నీకావు

తొమ్మిదిలోపు యాప్‌ ద్వారా హాజరు పంపకపోతే సెలవుగా పరిగణిస్తామని బెదిరింపు

తీరా రోజంతా ఆపసోపాలు పడ్డా జిల్లాలో అయిదు శాతం కూడా నమోదవని హాజరు

మరోపక్క జిల్లావ్యాప్తంగా యాప్‌ను బహిష్కరించిన ప్రాథమిక పాఠశాలల టీచర్లు

హైస్కూళ్లలో మాత్రం హెచ్‌ఎంలు భయపెట్టి మరీ ఉపాధ్యాయులతో యాప్‌ డౌన్‌లోడ్‌

చలో విజయవాడ ఉద్యమంపై కక్ష, సీపీఎస్‌పై భవిష్యత్తు పోరాటం అణిచివేయడానికి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఉపాధ్యాయులు తమ హాజరును నేరుగా పాఠశాలల్లో హాజరు పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం ఈ విధానాన్ని పక్క నపెట్టింది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హాజరు నమోదును సిమ్స్‌ ఏపీ యాప్‌ ద్వారా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన సిమ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పాఠశాల ప్రాంగణంలో ఫేషి యల్‌ రికగ్నెజేషన్‌ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లా లో దాదాపు అన్ని పాఠశాలలు జీపీఎస్‌కు అనుసంధానమై ఉండడంతో పాఠశాల ఆవరణలో మాత్రమే ఈ యాప్‌ హాజరు నమోదు చేయాల్సి ఉంది. అయితే దీనిపై ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి గతంలో ఐరిష్‌, బయోమెట్రిక్‌ ద్వారా ఉపాధ్యాయులు తమ హాజరు నమోదుచేసేవారు. దీనికోసం ప్రభుత్వమే అప్పట్లో ట్యాబ్‌లు, బయోమెట్రిక్‌ పరికరాలను పరఫరా చేసింది. కానీ జగన్‌ ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రవే శపెట్టిన సిమ్స్‌యాప్‌ హాజరుకు మాత్రం ఏ పరికరాలు కూడా పాఠశాలలకు ఇవ్వలేదు. సరికదా ఉపాధ్యాయులే తమ సొంత ఫోన్లలో తాము చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్య మైనా హాజరు తీసుకోని విధంగా ఈ యాప్‌ను ప్రభుత్వం తయారు చేసిం ది. వాస్తవానికి ఈ యాప్‌ ద్వారానే విద్యార్ధుల హాజరు కూడా టీచర్లు నమో దు చేయాలి. దీంతో మంగళవారం ఉదయం పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యా యులు సెల్‌ఫోన్‌లోని యాప్‌ తెరిచి తమ ఫోటోను అప్‌లోడ్‌ చేయడానికి ప్రయత్నించారు. కానీ యాప్‌ మొరాయించింది. దీంతో ఒకటికి పదిసార్లు ఉపాధ్యాయులు దీంతో రోజంతా కుస్తీ పడ్డారు. తొమ్మిది తర్వాత ఫోటో యాప్‌లో అప్‌లోడ్‌ కాకపోతే ప్రభుత్వం ఆరోజు తమను సెలవు కింద పరి గణిస్తామని చెప్పడంతో ఎక్కడికక్కడ స్కూళ్లలో టీచర్లు దీంతో నానా ఇబ్బం దిపడ్డారు. వాస్తవానికి హాజరు నమోదుకు ముందు జరగాల్సిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాక అనేక మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. తీరా యాప్‌ తెరుచుకున్నాక లొకేషన్‌ సెలెక్ట్‌ చేసి, అనంతరం కాంప్లెక్స్‌ హెచ్‌ఎమ్‌ లాగిన్‌లో రిజిస్టేషన్‌ పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మూడు ఫోటోలను (ఉపాధ్యాయుల ముఖ చిత్రాలు) కాప్చర్‌ చేయాల్సి ఉంది. తీరా, ఫోటోలు తీసిన తర్వాత అవి యాప్‌లో అప్‌లోడ్‌ కాలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉపా ధ్యాయులు తమ హాజరును నమోదు చేయలేకపోయారు. కొన్నిచోట్ల యాప్‌ ఓపెన్‌ కాక ఇబ్బంది పడ్డారు. మంగళవారం సిమ్స్‌ యాప్‌తోపాటు మిగిలిన యాప్‌లు కూడా ఎక్కువ సమయం మొరాయించాయి. దీంతో ఉపాధ్యాయు లు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. కాకినాడ జిల్లాలో మొత్తం 11వేల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో హైస్కూళ్లలో పనిచేసే దాదాపు నాలుగువేల మంది వరకు టీచర్లు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు నమోదు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయు లు చాలావరకు దీన్ని పట్టించుకోలేదు. కానీ పలుచోట్ల హెచ్‌ఎంలు ఇబ్బంది పెట్టడంతో అయిష్టంగా కొందరు డౌన్‌లోడ్‌ చేశారు. తీరా హాజరు సమయా నికి యాప్‌ మొరాయించింది. దీంతో జిల్లాలో హాజరు అయిదు శాతం కూడా నమోదవలేదు. మరోపక్క ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రం యాప్‌కు వ్యతిరేకంగా డౌన్‌లోడ్‌లు చేయలేదు. దీంతో పైఅధికారులు సూచిం చినా ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ హాజరును నమోదు చేయలేదు. 

ప్రభుత్వ తీరుపై అనుమానాలెన్నో..

సిమ్స్‌ యాప్‌ ద్వారా ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ హాజరు సేకరిస్తున్న ప్రభు త్వంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎందుకు ఈ విధానం పెట్టారు? దీని వెనుక మర్మమేమిటనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. వాస్తవానికి టీచర్లు తమ సెల్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత కాల్స్‌ ఎలౌ అని అడుగుతుండడంతో ఉపాఽధ్యాయుల్లో అనుమానం పెరిగింది. సిమ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత అనేక వివరాలు అడుగు తుండడంతో తమ వ్యక్తిగత భద్రతకు ముప్పని ఉపాధ్యయులు మొత్తుకుంటున్నారు. తమపై నిఘా పెట్టేందుకే దీనిని వినియోగిస్తున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏదైనా కొత్త యాప్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేస్తే వెంటనే లొకేషన్‌, గ్యాలరీలకు అనుమతి అడుగుతాయి. కానీ ఫోన్‌కాల్స్‌ యాక్సెస్‌ అడగడంపై ఉపాధ్యాయులు అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు. తమ కాల్స్‌తో ప్రభుత్వానికి పనేమిటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. తమ వ్యక్తిగత ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయబోమని, ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లు సరఫరా చేస్తే మాత్రమే దీనికి అంగీకరిస్తామని ఉపాధ్యాయ సంఘా లు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్కు సమస్య అధికంగా ఉండడంతో ఇప్పటికే యాప్‌లతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఎండీఎం నమోదు చేసే ఐఎమ్‌ఎమ్‌ఎస్‌ యాప్‌ పనిచేయకపోవడంతో డేటాను సేవ్‌ చేసి, నెట్‌వర్కు ఉన్న ప్రాంతానికి వచ్చి దాన్ని అప్‌లోడ్‌ చేసే పరిస్థితి అనేక పాఠశాలల్లో ఇప్పటికీ ఉంది. ఇప్పుడు కొత్త విధానంలో ఈ సమస్యలేవీ పరిగణలోకి తీసుకోకుండా హాజరు నమోదు చేయాలని ఒత్తిడి తేవడం తమ మెడపై కత్తేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సకాలంలో పాఠశాలలకు హాజరైనా కొన్నిసార్లు జీపీఎస్‌ తప్పుగా చూపి మీరు పాఠశాలకు వందల మీటర్ల దూరంలో ఉన్నారంటూ యాప్‌ ద్వారా చూపించిన సంఘటనలు ఉంటున్నాయని, ఇప్పుడు తాము సకాలంలో హాజరైనా యాప్‌లో నమోదు కాకపోతే దానికి బాఽధ్యులు ఎవరని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్‌ కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమవుతుండడంతో దాన్ని అణిచివేయడానికే ఇలా హాజరు పేరుతో భయ పెట్టడానికి బరితెగించిందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Updated Date - 2022-08-17T06:49:05+05:30 IST