ఎడ్సెట్, లాసెట్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-08-06T08:57:01+05:30 IST
ఎడ్సెట్, లాసెట్ ఫలితాలు విడుదల
ఎడ్సెట్లో 96.43శాతం.. లాసెట్లో 89శాతం మంది అర్హత
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బీఈడీ, లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్, లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సెట్లు నిర్వహించారు. శుక్రవారం మంగళగిరిలో ఈ ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ... బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 13978 మంది దరఖాస్తు చేసుకోగా 11384 మంది పరీక్షలు రాశారని, వారిలో 10978 (96.43శాతం) మంది అర్హత సాధించారని వివరించారు. లా కోర్సుల్లో... మూడేళ్ల కోర్సుకు 11592 మంది దరఖాస్తు చేసుకుని 9645 మంది పరీక్ష రాశారని, వారిలో 8759 మంది అర్హత సాధించారని తెలిపారు. ఐదేళ్ల కోర్సుకు 3092 మంది దరఖాస్తు చేసుకోగా 2630 మంది పరీక్షకు హాజరయ్యారని, 2091 మంది అర్హత సాధించారని చెప్పారు. రెండేళ్ల పీజీ కోర్సుకు 1025 మంది దరఖాస్తు చేసుకోగా 905 మంది పరీక్ష రాశారని, వారిలో 880 మంది అర్హత సాధించారని వివరించారు. మొత్తం లా కోర్సుల్లో 13180 మంది పరీక్షలు రాస్తే 11730(89శాతం) అర్హత సాధించారని తెలిపారు. పరీక్షల్లో కేవలం నాలుగు ప్రశ్నలపైనే అభ్యంతరాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ రామ్మోహనరావు పాల్గొన్నారు.