ఏడాది పాలనలో క్షీణించిన శాంతిభద్రతలు
ABN , First Publish Date - 2022-05-08T13:21:15+05:30 IST
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏడాదిపాటు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నాడీఎంకే సభాపక్షనాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. శనివారం ఉదయం
- ఎడప్పాడి ధ్వజం
చెన్నై: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏడాదిపాటు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నాడీఎంకే సభాపక్షనాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. శనివారం ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ అన్నాడీఎంకే శాసనసభ్యులు ఎడప్పాడి ఛాంబర్లోనూ గంటకుపైగా గడిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎడప్పాడి పళనిస్వామి అసెంబ్లీ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ఏడాది డీఎంకే పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లభించలేదని, ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చినట్లు అబద్ధపు ప్రకటనలను అట్టహాసంగా జారీ చేయడం మినహా రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. మునుపటి అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలనే ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం తమ పథకాలుగా ప్రకటించుకుని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నదని చెప్పారు. గృహిణులకు ప్రతినెలా వారి బ్యాంక్ఖాతాల్లో వెయ్యిరూపాయలను జమ చేస్తామని ప్రకటించిన స్టాలిన్ ఆ హామీని విస్మరించారని అన్నారు. కావేరి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు డీఎంకే ప్రభు త్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డెల్టా రైతులు ఆందోళ న చెందుతున్నారని చెప్పారు. నిరుపేద యువతులకు ఇచ్చే తాళికి బంగారం పథకాన్ని నిలిపివేశారని, అన్నాడీఎంకే హయాంలో అమలు చేసిన సబ్సిడీతో స్కూటీలను పంపిణీ చేసే పథకాన్ని రద్దు చేశారని, సంకాంత్రి పండుగకు నాసిరకమైన కిరాణా వస్తువులను పంపిణీ చేశారని ఆయన విమర్శించారు. ద్రావిడ తరహా పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అన్ని హామీలు నెరవేర్చినట్లు ప్రజానీకాన్ని మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.