Sanjay Rautకు మళ్లీ summons పంపిన ED
ABN , First Publish Date - 2022-06-28T22:39:15+05:30 IST
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈడీ, సీబీఐ, తదితర వ్యవస్థల ద్వారా ఒత్తిడి తేవడం వల్లే ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు వచ్చిందని ఆరోపిస్తోంది. షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గువాహటిలో బస చేస్తున్న సంగతి తెలిసిందే..
ముంబై: శివసేన(Shivsena) నేత సంజయ్ రౌత్(Sanjay Raut)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) మరోసారి సమన్లు పంపింది. 24 గంటలు కూడా గడవక ముందే రెండోసారి సమన్లు జారీ ఇవ్వడం గమనార్హం. మంగళవారం ముంబైలోని తమ కార్యాలయంలో హాజరు కావాలంటూ సోమవారం ఇచ్చిన సమన్లకు సంజయ్ రౌత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జూలై 1న హాజరు కావాలంటూ మంగళవారం మరోసారి సమన్లు జారీ చేశారు. నగదు అక్రమ చలామణి వ్యవహారం కేసులో ప్రశ్నిస్తామని, అందుకోసం తమ ఎదుట హాజరు కావాలని రౌత్కు జారీ చేసిన సమన్లలో ఈడీ పేర్కొంది.
అయితే సోమవారం ఈడీ సమన్లు పంపిన అనంతరం సంజయ్ రౌత్ స్పిందిస్తూ దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరారు. శివసేనపై పెద్ద కుట్ర జరుగుతోందని, భీకర యుద్ధానికి శివసైనికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన స్పందిస్తూ ‘‘ఈడీ నన్ను పిలిచిందని ఇప్పుడే నాకు తెలిసింది. మంచిది! మహారాష్ట్రలో మహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బాలా సాహెబ్ తాలూకు శివసైనికులమైన మేము గొప్ప యుద్ధంలో పోరాడుతున్నాం. ఇదంతా నన్ను ఆపేందుకు జరుగుతున్న కుట్ర. మీరు నా తలను తెగనరికినా, నేను గువాహటి మార్గంలోకి రాను. నన్ను అరెస్ట్ చేయండి. జైహింద్!’’ అని ట్వీట్ చేశారు.
సంజయ్ రౌత్ రూ.1,034 కోట్ల విలువైన పాట్రా చావల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆస్తులను ఈడీ ఏప్రిల్లో జప్తు చేసింది. ఇదిలావుండగా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈడీ, సీబీఐ, తదితర వ్యవస్థల ద్వారా ఒత్తిడి తేవడం వల్లే ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు వచ్చిందని ఆరోపిస్తోంది. షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గువాహటిలో బస చేస్తున్న సంగతి తెలిసిందే.