రూ.2,800 కోట్ల ఆస్తుల జప్తు

ABN , First Publish Date - 2020-07-10T05:57:05+05:30 IST

యస్‌ బ్యాంక్‌ కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తవ్వితీస్తోంది. ఇందులో భాగంగా బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు వాద్వానీలకు చెంది న రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు...

రూ.2,800 కోట్ల ఆస్తుల జప్తు

  • యస్‌ బ్యాంక్‌ కేసులో రాణా కపూర్‌,
  • వాద్వానీలపై పట్టు బిగిస్తున్న ఈడీ 

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌ కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తవ్వితీస్తోంది. ఇందులో భాగంగా బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు వాద్వానీలకు చెంది న రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు గురువారం తాత్కాలికంగా జప్తు చేశారు. ఇందు లో లండన్‌, న్యూయార్క్‌, ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఖరీదైన ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఆస్ట్రేలియాలోని కొన్ని భూములు కూడా ఉన్నాయి. నోటీసుల్లో వీటి విలువ రూ.2,203 కోట్లని పేర్కొ న్నా, వీటి మార్కెట్‌ విలువ రూ.2,800 కోట్లకుపైనే ఉంటుందని భావిస్తున్నారు. 

‘దేశ, విదేశాల్లో వీరికి స్థిర, చరాస్తులు జప్తు చేశాం. వీటి మార్కెట్‌ ధర రూ.2,800 కోట్లపైనే ఉంటుంది. జప్తు చేసిన ఆస్తుల్లో బ్యాంక్‌ ఖాతాలు, పెట్టుబడులు, ఖరీదైన విలాస వాహనాలూ ఉన్నాయి’ అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 


ఢిల్లీ బంగళా విలువే రూ.685 కోట్లు 

రాణా కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఢిల్లీ, ముంబైల్లోని ఆస్తుల విలువే రూ.1,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ఢిల్లీలోని అమ్రితా షెర్గిల్‌ మార్గ్‌లో ఉన్న బంగళా విలువే  రూ.685 కోట్ల వరకు ఉంటుందని ఈడీ పేర్కొంది. మిగతా రూ.1,600 కోట్ల ఆస్తులు డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లకు చెందిన ఆస్ట్రేలియాలోని భూములని సమాచారం. కపూర్‌, వాద్వానీలపై ఈడీ ఇప్పటికే అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసులు నమోదు చేసింది. ఈ చట్టం కిందే ఈడీ వీరి ఆస్తులను జప్తు చేసింది. తన హయాంలో డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ వంటి కొన్ని కంపెనీలకు నిబంధనలకు వ్యతిరేకంగా భారీగా రుణాలు ఇచ్చింది. తర్వాత అవి మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారి యస్‌ బ్యాంక్‌ను ఆర్థికంగా కుంగదీశాయి. ఈ అక్రమాలకు ప్రతిఫలంగా కపూర్‌ కుటుంబం, రుణాలు తీసుకున్న కంపెనీల నుంచి రూ.5,000 కోట్లకుపైగా ముడుపుల రూపంలో తీసుకుందని అంచనా. ఈ నిధులతో దేశ, విదేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఈడీ భావిస్తోంది. 


Updated Date - 2020-07-10T05:57:05+05:30 IST