‘ఫ్లిప్కార్ట్’కు,,, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిమానా...
ABN , First Publish Date - 2021-08-06T02:37:33+05:30 IST
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ జరిమాన విధించింది.
న్యూఢిల్లీ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్కు... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ జరిమానా విధించింది. విదేశీ పెట్టుబడుల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు వంద బిలియన్ రూపాయల జరిమానాను ఫ్లిప్కార్ట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన నోటీసులను ఫ్లిప్కార్ట్ సంస్థకు, దాని ఫౌండర్లకు ఈడీ పంపించింది. ‘వంద బిలియన్ రూపాయల ఫైన్ను మీరు ఎందుకు కట్టకూడదో వివరణ ఇచ్చుకోండి’ అంటూ ఈడీ నోటీసులో ఆదేశించింది. కొన్నేళ్ల నుంచి ఫ్లిప్కార్ట్తో పాటు మరో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్టు ఈడీ విచారణలో తేలింది. ఫారెన్ ఇన్వెస్టర్ డబ్ల్యూఎస్ రిటైల్ ద్వారా కస్టమర్లకు ఆ షాపింగ్ వెబ్సైట్లో వస్తువులు అమ్మిందని, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లా ప్రకారం అది నిషేధమని ఈడీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
మార్కెట్ నిపుణుల ప్రకారం... బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్ కార్ట్కు పేటెంట్ కంపెనీగా ఉన్న డబ్ల్యూఎస్ రీటైల్ సర్వీస్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి, ఆ పెట్టుబడులతో ఫ్లిప్కార్ట్ తన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో వివిధ రకాల ఉత్పత్తులపై అమ్మకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ పెట్టుబడుల విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన ఈడీ... కిందటి నెల చెన్నైలోని ఫ్లిప్కార్ట్ కార్యాలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.