కనీస అవసరాలు ఉచితాలు కాదు
ABN , First Publish Date - 2022-08-20T12:19:53+05:30 IST
ప్రభుత్వాలు ప్రజలకు అందించే పోషకాహారం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి కనీస అవసరాలను..
వాటిని అందుకోవడానికి పేదలు అర్హులే
ఉచితాలంటేనే పేదలకు ఉద్దేశించినవి
ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రభుత్వాలు ప్రజలకు అందించే పోషకాహారం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి కనీస అవసరాలను ఉచితాలు అనకూడదని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ తాజాగా అభిప్రాయపడ్డారు. ఇలాంటి కనీస అవసరాలను ఉచితంగా అందుకోవడానికి పేదలు పక్కాగా అర్హులని చెప్పారు. ‘ఉచితాలు’ అనే పదమే.. ఆ పథకాలు పేదలకు ఉద్దేశించినవని సూచిస్తుందని తెలిపారు. భారత్లో పేదరికానికి అనేక కారణాలుంటాయని.. నిరుపేదలందరికీ పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య, గూడు వంటి కనీస సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వాలు చేసేది చాలా స్వల్పమని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి భారత్లో ధనవంతుల కంటే పేదలే తమ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని పన్నులుగా చెల్లిస్తున్నారని చెప్పారు. ‘ఉచితాలు’ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని, ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా ‘ఉచిత’ హామీలు ఇచ్చేస్తున్నాయని, వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా సూచించింది. ఇక.. కొందరు రాజకీయ నాయకులు భారత ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడంపై జయతి స్పందించారు. భారత్కు అలాంటి పరిస్థితి రాదని ఆమె తేల్చిచెప్పారు. మన దగ్గర భారీగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని చెప్పారు. అయితే సమీప భవిష్యత్తులో కొన్ని పెద్ద ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.