ఆ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి...కేంద్రానికి తెలిపిన ఈసీ
ABN , First Publish Date - 2021-12-28T00:37:47+05:30 IST
వచ్చే ఏడాది ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ను..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలని కేంద్రానికి భారత ఎన్నికల సంఘం సోమవారంనాడు తెలిపింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్తో సహా కోవిడ్ కొత్త కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈసీ ఈ సూచనలిచ్చింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిపై ఇప్పటికే కేంద్రాన్ని ఈసీ నివేదిక కోరింది..
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్, గోవాల్లో అర్హులైన 100 శాతం జనాభాకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో 85 శాతానికి తొలి డోసు ఇవ్వగా, మణిపూర్, పంజాబ్లో ఇది 80 శాతం కంటే తక్కువగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ డాటాను ఎన్నికల కమిషన్కు అందజేసింది.
మరోవైపు, కోవిడ్ కేసుల పెరుగుదల ఒమైక్రాన్ వేరియంట్ ముప్పు మధ్య అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఐదు రాష్ట్రాల్లో ర్యాలీల నిర్వహణపై భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఐటీబీబీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాలతో ముడిపడిన అంతర్జాతీయ సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన సూచనలిచ్చింది. ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సైతం ఎన్నికల కమిషన్ను కలిసి దేశంలోని కోవిడ్ పరిస్థితిని వివరించారు. కాగా, ఎన్నికల సంసిద్ధతను సమీక్షిచేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయన సహచర ఎన్నికల కమిషనర్లు మంగళవారంనాడు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు