గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-07-25T17:32:39+05:30 IST
గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,60,828 క్యూసెక్కులుంది.
తూ.గో. జిల్లా: గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,60,828 క్యూసెక్కులుంది. దీంతో విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరులో రెండు బృందాలు, వి.ఆర్ పురంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు.