హౌసింగ్ అధికార్లపై కలెక్టర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-09-27T07:00:43+05:30 IST
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకూ 7 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఇవ్వగా, కేవలం 9 శాతం మాత్రమే పనులు చేయడంతో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత జిల్లా హౌసింగ్ అధికారులు, ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్ట
ఈవారంలో 7 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, 9 శాతమే పనులు
వేగం పెంచకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరిక
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకూ 7 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఇవ్వగా, కేవలం 9 శాతం మాత్రమే పనులు చేయడంతో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత జిల్లా హౌసింగ్ అధికారులు, ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సీహెచ్.శ్రీధర్, జిల్లా హౌసింగ్ అధికారి టి.తారాచంద్ తదితరులతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకుని రావడమే కాకుండా వారి సర్వీసులను క్రమబద్ధీకరించి శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని, వారికి ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలను ఇస్తే పనితీరు మెరుగుగా లేదని, అటువంటి వారు, హౌసింగ్ సిబ్బంది వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పనితీరు మెరుగుపరుచుకోలేని వారిని డిప్యూటేషన్ మీద పంపిస్తానని, చర్యలు తీవ్రంగా ఉం టాయని ఆమె హెచ్చరించారు. జిల్లాలో 48,247 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం చేపట్టవలసి ఉండగా, 26,997 మంది ఇంకా పునాది దశలోనే ఉన్నారని, 302 మంది అసలు పని మొదలు పెట్టలేదన్నారు. వారిలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్నవారితోపాటు, లేనివారికి కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిం చాలని ఆమె సూచించారు. ఈ బాధ్యత డీఆర్డీఏ, మెప్మా క్షేత్రస్థాయి సిబ్బందిదేనని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎస్.డేగలయ్య, డీఎల్డీవోలు పి.వీణాదేవి, వి.శాంతామణి పాల్గొన్నారు.
కలెక్టరేట్ స్పందనలో 196 అర్జీల స్వీకరణ
బొమ్మూరు, సెప్టెంబరు 26 : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పంద నలో ఆమెతోపాటు జేసీ శ్రీధర్ అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థి తుల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇక ప్రజల నుంచి స్పందనలో 196 అర్జీలు వచ్చినట్టు అధికారులు తెలి పారు. ప్రతీ గురువారం రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు, స్పందనపై సమీక్షలు నిర్వహిస్తున్నారని, దానికి అనుగుణంగా బుధవారం నాటికి నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ శాఖల పీడీలు, అధికారులు, డీఎంహెచ్వో వసుంధర, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ బాలశంకర్ పాల్గొన్నారు.
కలెక్టరేట్లో వాటర్ ప్లాంట్ ప్రారంభం
కలెక్టరేట్లో తాగునీటి ప్లాంట్, రెండు కూలింగ్ యూనిట్లను కలెక్టర్ కె.మాధవీలత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్కు నిత్యం వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటుచేశామన్నారు. జేసీ శ్రీధర్, ఇంచార్జ్ డీఆర్వో ఎస్.మల్లిబాబు పాల్గొన్నారు.