బోస్నియాను వణికించిన Earthquake
ABN , First Publish Date - 2022-04-23T12:51:23+05:30 IST
దక్షిణ బోస్నియాలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం వణికించింది....
సరజెవో: దక్షిణ బోస్నియాలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం వణికించింది. బోస్నియాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. బాల్కన్లోను భూమి కంపించిందని అధికారులు చెప్పారు. లుబింజే పట్టణానికి ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.భూకంప కేంద్రం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గ్రేడ్, జాగ్రెబ్, స్కోప్జే వరకు ప్రకంపనలు సంభవించాయని బోస్నియా అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ హెచ్చరించింది.
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్కు సమీపంలోని పెట్రింజా ప్రాంతంలో 2020వ సంవత్సరం డిసెంబర్ 29వతేదీన 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏడుగురు మరణించారు. క్రొయేషియా భూకంపం వల్ల వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి.2020 వ సంవత్సరం మార్చి నెలలో జాబ్రేబ్ను 5.3 తీవ్రతతో భూమి కంపించింది. 2019వ సంవత్సరం నవంబరులో అల్బేనియాలో సంభవించిన 6.4 భూకంపం కారణంగా 50 మందికి పైగా మరణించారు. ఈ భూకంపం వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు.