అద్దంకిలో భూప్రకంపనలు
ABN , First Publish Date - 2022-05-16T02:06:13+05:30 IST
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం
అద్దం: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10.31 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలో వస్తువులు కదిలి శబ్ధాలు వచ్చాయి. పలువురు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ లోపే సాధారణ స్థితి నెలకొనటంతో ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది మాత్రం భూమి కంపించింది నిజమేనా లేక భ్రమా అన్న ఆలోచనలో ఉన్నారు. మిగిలిన వారితో మాట్లాడిన తరువాత భూమి కంపించింది నిజమేనని నిర్ధారించుకున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా ఏటా ఒకటి రెండు సార్లు అద్దంకి ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ప్రజలలో నెలకొంది.