అసలే భారీవర్షం...ఆపై భూకంపం
ABN , First Publish Date - 2021-11-29T12:52:28+05:30 IST
భారీవర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న తమిళనాడు రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది....
ఇదీ వెల్లూరులో పరిస్థితి
వెల్లూరు (తమిళనాడు): భారీవర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న తమిళనాడు రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అసలే భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తుతుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు సోమవారం తెల్లవారుజామున వెల్లూరు నగరానికి 59 కిలోమీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది.వెల్లూరులో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ తెలిపింది. తెల్లవారుజామున భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం భూప్రకంపనల భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు.
భారీవర్షాల వల్ల వెల్లూరు ప్రాంతంలోని ప్రాజెక్టు జలాశయాలు, చెరువులు వరదనీటితో నిండిపోయాయి. వెల్లూరు, తిరుపట్టూర్ జిల్లాలో పాలార్ నది పొంగి ప్రవహిస్తోంది. చెక్ డ్యామ్ లు, లోలెవెల్ బ్రిడ్జీలపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. మరోవైపు భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు.