కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST
కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
- ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ప్రధానికి విన్నవించేందుకు యత్నం
- సికింద్రాబాద్ వెళ్లకుండా అడ్డుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు
శామీర్పేట/తాండూరు రూరల్/వికారాబాద్, జూలై 3 : హైదరాబాద్కు విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని విన్నవించడానికి వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నాయకులను ఆదివారం శామీర్పేట పోలీసులు అడ్డుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శంకర్గౌడ్, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు నగరానికి బయలుదేరగా.. విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. దీంతో కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసుస్టేషన్ ఆవరణలో ఆందోళన చేశారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన సడక్ బంద్ పిలుపు మేరకు ఆదివారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళుతున్న తాండూరు ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నాయకులు నర్సింహులుతోపాటు పలువురు ఉన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభ నేపథ్యంలో వికారాబాద్ యువజన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీ్షరెడ్డి, ప్రధాన కార్యదర్శి నిఖిల్రెడ్డి, నాయబ్ జానీ తదితరులు ఉన్నారు.