మునుగోడులో టీఆర్‌ఎస్‌ సైలెంట్‌ ఆపరేషన్‌

ABN , First Publish Date - 2022-09-27T08:37:04+05:30 IST

దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో అధికార పార్టీని అప్రమత్తం చేసినట్లుంది.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ సైలెంట్‌ ఆపరేషన్‌

  • క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును
  • సామాజిక వర్గాల వారీగా ఓట్ల వేట
  • విందు భోజనాలు, విహార యాత్రలు
  • దళిత బంధు లబ్ధిదారులే ప్రచారకర్తలు
  • సమన్వయం చేస్తున్న ఎమ్మెల్యేలు
  • కొత్త ఓటర్ల నమోదుపైనా జాగ్రత్తలు

నల్లగొండ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో అధికార పార్టీని అప్రమత్తం చేసినట్లుంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ తన సహజ సిద్ధమైన దూకుడును తగ్గించి క్షేత్రస్థాయిలో ఓట్ల వేటకు పక్కా వ్యూహానికి తెరలేపింది. కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులనే ప్రచారకర్తలుగా వాడుకుంటూ సైలెంట్‌ ఆపరేషన్‌ చేస్తోంది. విందు భోజనాలు, విహార యాత్రలతో దళిత, గిరిజన ఓట్లకు గురిపెట్టింది. ముఖ్యంగా మునుగోడులో ఓటర్ల నమోదుపై అధికార పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అధికారులకు తగిన జాగ్రత్తలు చెబుతూ ఈ కార్యక్రమంపై ఓ కన్నేసింది. సాధారణంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే రెండు వేలకు మించి కొత్త ఓట్లు నమోదు కావు. అలాంటిది మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఓటు హక్కు కావాలంటూ ఇప్పటికే 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లు ఉంటే కొత్తగా 23వేల మంది ఓటు హక్కు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నీ హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచే వస్తున్నాయి. ఇవి బీజేపీ నేతలు, సానుభూతిపరుల ఓట్లేనని సీఎం కేసీఆర్‌ అనుమానిస్తున్నారు. ఈ మేరకు కొత్త ఓట్లను సీరియ్‌సగా తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ యంత్రాంగం ప్రతిరోజు ప్రత్యేక సమావేశాలతో బిజిబిజీగా ఉంటున్నారు. కొత్త ఓటు దరఖాస్తును బీఎల్వో విచారిస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ బాధ్యతను సూపర్‌వైజర్లు, తహసీల్దార్లకు అప్పగించారు. 


ఆత్మీయ సమ్మేళనాలు, విందు భోజనాలు

పార్టీ సానుభూతిపరులు, గ్రామ, మండల స్థాయి నాయకులు ప్రతి మండలంలో కుటుంబ సభ్యులతో సహా సమావేశాలు కావాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సూచించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ సాధన, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిపై ఆట, పాటలతో వివరించాలని నిర్దేశించింది.  సమావేశాలకు వచ్చేవారికి పసందైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 26వ తేదీతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈ సమ్మేళనాలు ముగించారు. ఒక్కో మండలంలో ఆత్మీయ సమ్మేళనానికి రూ.50లక్షలు ఖర్చుచేసిందని సమాచారం. సమ్మేళనాలు చేపడుతూనే మరోవైపు సామాజిక వర్గాల వారీగా ఓట్ల వేటను మొదలుపెట్టారు. నియోజకవర్గంలో 12 వేల మంది గిరిజన ఓటర్లు ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు మండల కేంద్రం నుంచి విలాసవంతమైన బస్సు ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మగౌరవ భవనాల సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 


అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దళితబంధు లబ్ధిదారులను మునుగోడుకు తీసుకువచ్చి స్థానిక దళిత ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలాన్ని దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఈ మండలంలో ఇప్పటికే 700 మందికి యూనిట్లను మంజూరు చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే దళితబంధు ప్రయోజనం పొందిన వారిని గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోని లబ్ధిదారులను ఉదయాన్నే మునుగోడులోని వివిధ గ్రామాల్లో దళిత కాలనీలకు తరలిస్తున్నారు. ‘సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకంతో లబ్ధిపొందాం.... ఈ పథకం రాబోయే రోజుల్లో దళితులందరికీ అందుతుంది, టీఆర్‌ఎస్‌‌ను గెలిపించాలి’ అంటూ వారు ప్రచారం చేస్తుండటం విశేషం. మధ్యాహ్న సమయంలో ఆయా కాలనీల్లోని దళితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు కలిసి ఆత్మీయవిందులో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, బాల్క సుమన్‌ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2022-09-27T08:37:04+05:30 IST