తెంపల్లిలో మృతుల ఒక్కో కుటుంబానికి రూ. కోటి ప్రకటించాలి : TDP Leaders
ABN , First Publish Date - 2022-07-21T23:45:55+05:30 IST
కృష్ణా: గన్నవరం మండలం తెంపల్లి గ్రామాన్ని అతిసార పట్టి పీడిస్తుంది. గ్రామంలో తాగునీరు కలుషితం కావడంతో గ్రామస్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు పట్టాభి,
కృష్ణా: గన్నవరం మండలం తెంపల్లి గ్రామాన్ని అతిసార పట్టి పీడిస్తుంది. గ్రామంలో తాగునీరు కలుషితం కావడంతో గ్రామస్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు పట్టాభి, బోండా ఉమ, బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్, కొనకళ్ల నారాయణ, బచ్చుల అర్జునుడు తెంపల్లిలో పర్యటించారు.
ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ.. తెంపల్లిలో కలుషితమైన నీరు తాగి ఆరుగురు మృతి చెందగా, 147 మంది అనారోగ్యం బారినపడ్డారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
బోండా ఉమా మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి పైప్ లైన్లు మురుగు కాలువలో ఉన్నాయన్నారు. మురుగు కాలువల దుస్థితి గురించి గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేస్తే పంచాయతీల్లో నిధులు లేవని, ప్రభుత్వం మొత్తం తీసేసుకుందని చెప్పడం సిగ్గుచేటన్నారు.
బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. తెంపల్లిలో తమ హయాంలో వేసిన రోడ్లు తప్ప కొత్త రోడ్డు లేదన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే వంశీ గ్రామంలోకి రాకపోవడం బాధాకరమన్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పట్టాభి మాట్లాడుతూ.. తెంపల్లిలో జరిగిన ఘటనకు సీఎం జగన్ నిర్లక్ష్యమే కారణమన్నారు. కేంద్ర నుంచి వచ్చిన విపత్తుల నిధులు ఎక్కడ దాచారని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ తీరు దారుణంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వంశీ బాధితులకు రూ. లక్ష పంపించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని, తెంపల్లి గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.