తాను చనిపోతూ... మరో నలుగురికి కొత్త జీవితం
ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST
బ్రెయిన్డెడ్కు గురైన ఓ విద్యార్ధి అవయవ దానం మరో నలుగురికి పునర్జన్మ ప్రసాదించాయి
ఇంటర్ విద్యార్థికి బ్రెయిన్ డెడ్
అవయవ దానం చేసిన కుటుంబీకులు
మెదక్అర్బన్, మే 20: బ్రెయిన్డెడ్కు గురైన ఓ విద్యార్ధి అవయవ దానం మరో నలుగురికి పునర్జన్మ ప్రసాదించాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, కళ్లు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు యువకుని కుటుంబీకులు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్, జ్యోతి దంపతుల కుమారుడు మోక్షిత్(18) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 19న చివరి పరీక్ష ఉండగా... ఆకస్మాత్తుగా ఈ నెల 18న రాత్రి ఫిట్స్ వచ్చాయి. దాంతో కుటుంబీకులు వెంటనే మోక్షిత్ను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స చేస్తున్న వైద్యులు మోక్షిత్కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్డెడ్ అయినట్లు గుర్తించారు. దాంతో ఆతని కుటుంబీకులు జీవన్దాస్ పథకం ద్వారా అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల బృందం ఆపరేషన్ చేసి శరీరం నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు వేరు చేశారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.