ఇవెక్కడి పందాలు బాబోయ్.. పందుల పందాలా.. ఏపీలో ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-05-18T15:36:17+05:30 IST

ద్వారకాతిరుమలలో పందుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ద్వారకా తిరుమలకు చెందిన పంది విజయం సాధించింది

ఇవెక్కడి పందాలు బాబోయ్.. పందుల పందాలా.. ఏపీలో ఎక్కడంటే..

ఏలూరు జిల్లా: మీరు కోళ్ల పందాల గురించి విని ఉంటారు. పొట్టేళ్ల పందాలను చూసి ఉంటారు. ఎద్దుల పందాల గురించి కూడా తెలిసే ఉంటుంది. కానీ.. కాదేదీ పందాలకు అనర్హం అన్నట్టుగా ఏపీలో ఓ చోట పందుల పందాలను నిర్వహించారు. వరాహాలు రెండూ ఢీ అంటే ఢీ అని కుమ్మేసుకున్నాయి. చివరికి ఆ పందెం పందుల్లో ఒకటి పోరాడలేక పారిపోయింది. అక్కడే బరిలో నిలిచి ‘దమ్ముంటే కుమ్మేసుకుందాం రా’ అన్నట్టుగా చూస్తున్న వరాహాన్ని విజేతగా ప్రకటించారు. ఈ పందాలు కొంచెం వెరైటీగా అనిపించినా అక్కడ నిల్చుని చూస్తున్న వారికి మాత్రం అదో ఆటవిడుపులా, కాలక్షేపంగా అనిపించాయి. కోడి పందాలను కూడా అంత ఆసక్తిగా చూడరేమో. అంతలా ఆ పందుల పందాలను కళ్లప్పగించి వీక్షించారు. ఒకే జాతిలో పుట్టి కలిసిమెలిసి ఉండే నోరు లేని మూగజీవాల మధ్య జాతి వైరం సృష్టించి ఒకదానిపై మరొక దానిని ఉసిగొల్పి కొందరు మనుషులు ఎలాంటి ఆనందం పొందుతారో ఈ ఘటన మరోసారి నిరూపించింది.



ద్వారకాతిరుమలలో ఈ పందుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ద్వారకా తిరుమలకు చెందిన పంది విజయం సాధించింది. ద్వారకా తిరుమల శివారు వెంకటకృష్ణాపురం రోడ్లో ఖాళీ ప్రదేశంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ద్వారకాతిరుమల, రాజమండ్రికి చెందిన పందులను బరిలోకి దింపారు. అయితే బరిలో దిగిన రెండు పందులు ఐదు నిమిషాల పాటు ఒక దానిపై ఒకటి విరోచితంగా పోరాడాయి. చివరకు పోటీలో రాజమండ్రికి చెందిన పంది పారిపోయింది. దీంతో ద్వారకాతిరుమల చెందిన పందిని విజేతగా ప్రకటించారు. ఈ పోటీలు చూసేందుకు స్థానికులు అక్కడికి చేరుకొని ఆసక్తిగా తిలకించారు.



Updated Date - 2022-05-18T15:36:17+05:30 IST