డ్వాక్రాను నిర్వీర్యం చేస్తున్నారు
ABN , First Publish Date - 2021-12-03T05:38:05+05:30 IST
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నదని జడ్పీ మాజీ చైర్మన్ రాజశేఖర్ అన్నారు.
- ఆడబిడ్డలను గౌరవించిన ఘనత టీడీపీదే
- జడ్పీ మాజీ చైర్మన్ రాజశేఖర్
ఓర్వకల్లు, డిసెంబరు 2: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నదని జడ్పీ మాజీ చైర్మన్ రాజశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన రాజశేఖర్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్, పొదుపు మహిళలు మాట్లాడుతూ అభయ హస్తం పేరుతో సీఎం జగన్ డ్వాక్రా మహిళలను మోసగించారని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పరిపుష్ఠి సాధించడానికి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ అప్పుల కోసం డ్వాక్రా పథకాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36 లక్షల మంది డ్వాక్రా గ్రూపులలోని రూ.2వేల కోట్లను జగన్ ప్రభుత్వం వాడేసుకుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి అభయహస్తం నిధులు లాక్కోవడం సరికాదన్నారు. ఎల్ఐసీకీ ఇచ్చిన అభయహస్తం తమకు సంబంధం లేదని ప్రకటించడం దారుణమని అన్నారు. అభయహస్తం డబ్బులు తిరిగి తమ ఖాతాల్లో జమ చేయకపోతే ఆందోళనలు చేపడుతామని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నమ్మ, ఉప సర్పంచ్ షమీనాబీ, మహిళలు ఉమామహేశ్వరమ్మ, బన్నూరు నాగమ్మ, లక్ష్మీదేవి, జయమ్మ, టీడీపీ నాయకులు మహబూబ్ బాషా, సుధాకర్, నారాయణ, బజారు, వడ్డె నారాయణ, మహిళలు పాల్గొన్నారు.