భారత్‌ ఎందుకు క్షమాపణ చెప్పాలి?.. అరబ్ దేశాలకు భయపడొద్దు: Geert Wilders

ABN , First Publish Date - 2022-06-08T13:20:06+05:30 IST

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మకు నెదర్లాండ్స్‌ పార్లమెంటు సభ్యుడు, ఫ్రీడం పార్టీ అధ్యక్షుడు గీర్ట్‌ విల్డెర్స్‌ మద్దతుగా నిలిచారు.

భారత్‌ ఎందుకు క్షమాపణ చెప్పాలి?.. అరబ్ దేశాలకు భయపడొద్దు: Geert Wilders

నూపుర్‌ శర్మ మాట్లాడిందంతా నిజమే

ఆమెకు నెదర్లాండ్స్‌ ఎంపీ విల్డెర్స్‌ మద్దతు

ఆంస్టెర్‌డమ్‌, జూన్‌ 7: బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మకు నెదర్లాండ్స్‌ పార్లమెంటు సభ్యుడు, ఫ్రీడం పార్టీ అధ్యక్షుడు గీర్ట్‌ విల్డెర్స్‌ మద్దతుగా నిలిచారు. ఆమెపై అరబ్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. మహమ్మద్‌ ప్రవక్త గురించి ఆమె మాట్లాడిందంతా నిజమే అన్నారు. నూపుర్‌ శర్మ తప్పుడు ఆరోపణలు ఏమీ చేయలేదని మంగళవారం వరుస ట్వీట్లలో విల్డెర్స్‌ తెలిపారు. ఆయెషా ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెను ప్రవక్త పెళ్లి చేసుకున్నారంటూ నూపుర్‌ శర్మ చేసిన ప్రకటన పూర్తిగా వాస్తవమేనని పేర్కొన్నారు. భారతదేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బుజ్జగింపు ఎప్పటికీ పనిచేయబోదని, దాని వల్ల పరిస్థితులు దిగజారుతాయని హితవు పలికారు. ‘భారతదేశంలోని నా మిత్రులారా.. ఇస్లామిక్‌ దేశాలకు భయపడకండి. ప్రవక్త గురించి నిజం చెప్పిన నూపుర్‌ శర్మను సమర్థిస్తూ ధైర్యంగా, స్వేచ్ఛగా, గర్వంగా నిలబడండి’ అని పిలుపునిచ్చారు. తనను చంపుతానంటూ పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం పంపిన బెదిరింపు సందేశం స్ర్కీన్‌ షాట్‌ను కూడా విల్డెర్స్‌ షేర్‌ చేశారు. పాకిస్థాన్‌, తుర్కిష్‌ ముస్లింల నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉంటాయని, అయినా తాను నిజం మాట్లాడటం ఆపబోనని స్పష్టం చేశారు. ఇస్లాం విధానాలను విల్డెర్స్‌ తరచుగా విమర్శిస్తుంటారు. ‘నేను ముస్లింలను ద్వేషించను. ఇస్లాంను ద్వేషిస్తాను. ఇస్లాం అనేది ఒక మతం కాదు. అదొక వెనుకబడిన సంస్కృతికి సంబంధించిన భావజాలం’ అని ఓ ఇంటర్వ్యూలో విల్డెర్స్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-08T13:20:06+05:30 IST