‘చెత్త’ బాదుడు!
ABN , First Publish Date - 2021-12-05T06:39:08+05:30 IST
జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచా యతీల్లో చెత్త పన్ను ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు.
పట్టణాలు, నగరాల్లో చెత్త పన్ను బెడద
ఆందోళన చెందుతున్న ప్రజలు
స్లమ్లో ఇంటికి రూ.60.. నాన్ స్లమ్లో రూ.90
కమర్షియల్కు రూ.100 నుంచి రూ.5 వేల వరకు
కాకినాడ నగరంలో మరింత ఎక్కువ
మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోనూ వసూళ్లు
ఇప్పటికే రూ. 80 లక్షల మేర వసూలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచా యతీల్లో చెత్త పన్ను ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. గతంలో వీధులను శుభ్రంచేయడం, చెత్త తీసుకుని వెళ్లి, డంపింగ్ యార్డు ల్లో వేసి కుళ్లబెట్టడమో, దహనం చేయడమో చేసేవారు. కానీ ఇవా ళ చెత్తకు కూడా పన్ను వసూలు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలోనూ ప్రతీ రోజు వ్యర్థ పదార్థాలు, చెత్త ఉంటుంది. దాన్ని తీసుకుని వెళ్లి పడేయడానికి మున్సిపాల్టీలకు పన్ను కట్టాలని కొత్తగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నిర్ణయాలు చేసిన సంగతి తెలి సిందే. గతేడాది అక్టోబరు నుంచే ఈ వసూలు మొదలు పెట్టారు. అప్పుడు కేవలం స్లమ్ ఏరియాలోని ఇళ్ల నుంచి రూ.10, నాన్ స్లమ్ ఏరియాలోని ఇళ్ల నుంచి రూ.30 వసూలు చేసేవారు. కమర్షియల్ ఏరియాలో ఎక్కువ వసూలు చేసేవారు. కానీ ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా చెత్త పన్నుపై దృష్టిపెట్టి అమాంతం పెంచేసింది. సొంత ఇల్లు అయినా, అద్దెకు ఉన్నా, ఇంట్లో కాపురం ఉంటే చాలు చెత్త పన్ను కట్టవలసిందే. రాజమహేంద్రవరంలో స్లబ్ ఏరియా ఇంటికి నెలకు రూ.50, నాన్ స్లమ్ ఏరియాలోని ఇంటి నుంచి రూ.90 వసూలు చేస్తున్నారు. అంటే ఏడాదికి స్లమ్ ఏరియాలోని ఇంటి నుంచి రూ.600, నాన్స్లమ్ ఏరియాలోని ఇంటి నుంచి ఏడాదికి రూ.1080 వసూలు చేస్తున్నారు. ఇక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కనీస పన్ను రూ. 100, అత్యధికం రూ.5000 వసూలు చేస్తున్నారు. చిన్న షాపు నుంచి రూ.100 వసూలు చేస్తారు. పెద్ద షాపు అయితే ఎక్కువ వసూలు చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రు లు వంటివి అయితే నెలకు రూ.5 వేలు చెల్లించవలసిం దే. అంటే కమర్షియల్ ఏరియాలో చిన్నషాపులు ఏడాదికి రూ.1200, పెద్దవి ఏడాదికి రూ.60 వేల వరకూ చెత్త పన్ను చెల్లించవలసిందే. దీంతో ప్రజలు తీవ్ర గగ్గోలు పెడుతున్నారు. కమర్షియల్ ఏరియాలో కొంతమేర పన్ను చెల్లిస్తున్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో ప్రజలు ఒప్పుకోవడం లేదు. అయినా సచివాలయ శానిటరీ సెక్ర టరీ ద్వారా ఇంటింటికీ ఒత్తిడి తెచ్చి, పన్నులు వసూలు చేస్తున్నారు. రాజమమహేంద్రవరంలో కంటే కాకినాడ కార్పొరేషన్లో మరింత అధికంగా చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. అమలాపురం, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, తుని, ఏలేశ్వరం ప్రాంతాల్లో ఆయా మున్సి పాల్టీల స్థాయి బట్టి చెత్త పన్ను బాదేస్తున్నారు. రాజ మహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో నెలకు చెత్త పన్ను డిమాండ్ రూ.80 లక్షలు. ఇక్కడ ఒక లక్షా 20 వేలు ఇళ్లు ఉండగా, 20 వేలకు పైగా కమర్షియల్ దుకా ణాలు, సంస్థలు, ఆసుపత్రులు ఉన్నాయి. అంటే ఏడాదికి రూ.9 కోట్ల 60 లక్షల చెత్త పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక జిల్లాలో ఇప్పటికే సుమారు 81 లక్ష ల వరకు చెత్తపన్ను వసూలు చేశారు. రాజమహేంద్ర వరంలో రూ.21,28,530, కాకినాడ నగరంలో 51,23,717, తునిలో 4,980, పిఠాపురంలో 35,200, సామర్లకోటలో రూ.20,150, మండపేటలో రూ.1,09,310, రామచంద్ర పురంలో రూ.4,79,110, పెద్దాపురంలో రూ.80,550, గొల్ల ప్రోలులో 31,380, ఏలేశ్వరంలో రూ.9,100, ముమ్మిడి వరంలో 27,960 వసూలు చేశారు.