చినుకుల కాలమంతా చిత్తడే

ABN , First Publish Date - 2022-08-09T06:29:53+05:30 IST

చినుకుల కాలమోస్తే చాలు మండలంలోని పలు రహదారులు చిత్తడిగా మారుతున్నాయి.

చినుకుల కాలమంతా చిత్తడే
మేడపిలోని ఆంధ్రాబ్యాంకు రహదారి

అధ్వానంగా అంతర్గత రోడ్లు

నెలల పాటు తప్పని అవస్థలు 

త్రిపురాంతకం, ఆగస్టు 8: చినుకుల కాలమోస్తే చాలు మండలంలోని పలు రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. ఒక్కసారి వర్షం వస్తే ఇరవై రోజులు చిత్తడిగా ఉండడంతో వర్షాకాలమంతా దాదాపు ఆ దారులు బురదమయమై ఉంటున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లు గోతులమ యంగా మారాయి. దీంతో నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయింది. దీంతో అయా గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. త్రిపురాంతకంలోని ఉత్తరపువీధి, బ్రహ్మంగారికాలనీలో రోడ్లు చిత్తడిగా తయారై గుంతలమయంగా మారాయి. ఎన్నెస్పీ కాలనీలోని ప్రభుత్వ వైద్యశాల రహదారి మోకాలిలోతు గుంతలతో బురదమయమైంది. ఈ వీధిలో ప్రతిరోజూ వైద్యశాలకు వచ్చే రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కస్తూర్భా బాలికల పాఠశాల కూడా ఇదే వీధిలో ఉంది. గణపవరం గ్రామంలోని ప్రధాన రహదారి, మేడపిలోని ఆంద్రాబ్యాంకు బజా ర్‌, మేడపి నుండి ఎండూరివారిపాలెం రోడ్డు, పాతఅన్నసముద్రం ప్రధాన రహదారి మరీ అధ్వానంగా మారి వాహనదాలుకు, పాదచారులకు కనీసం నడిచేందుకూ వీలులేకుండా ఉంది. ఇక జి.ఉమ్మడివరం, సోమేపల్లి, హసానాపురం, కేశినేనిపల్లి, విశ్వనాథపురం, లేళ్లపల్లి ఎస్సీకాలనీ, కంకణాలపల్లి ఎస్సీకాలనీ, మిరియంపల్లి ఒడ్డుపాలెం గ్రామాల్లో అంతర్గత రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. దీనికితోడు గ్రామాల్లో ఎక్కడా సైడు కాలువలు లేకపోవడంతో వర్షపు నీటితోపాటు, ఇళ్లలో వాడుకున్న వృథానీరు రోడ్లపైనే నిలుస్తోంది. దీంతో దుర్వాసన వెదజల్లుతూ ఇబ్బందికరంగా మారింది. జ్వరాలు కూడా వ్యాప్తిచెందే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు గ్రామాల అంతర్గత రహదారులు, సైడు డ్రైనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-08-09T06:29:53+05:30 IST