పోటెత్తిన భక్తజనం
ABN , First Publish Date - 2022-07-04T05:15:47+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి, అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
ఆషాఢ సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి భారీసంఖ్యలో వచ్చిన భక్తులు
వన్టౌన్, జూలై 3 : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి, అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వృద్ధులు, చిన్నారులు కొంత ఇబ్బంది పడ్డారు. ఆలయ ఈవో పర్యవేక్షణలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. అన్నప్రసాదం స్వీకరించడానికి వెళ్లే భక్తులతో మహామండపంలోని 2, 3 అంతస్థులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహామండపంలోని లిఫ్ట్ల వద్ద భక్తులు రద్దీ పెరిగింది. దీంతో పలువురు భక్తులు లిఫ్ట్లో వెళ్లడానికి పోటీ పడటంతో తోపులాట జరిగింది. కొండ దిగువున కనకదుర్గనగర్ ప్రాంగణం, కొండపైనా వాహనాలు భారీగా బారులు తీరాయి. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్టౌన్, రథం సెంటర్ నుంచి కొండపై వరకు భక్తుల కిక్కిరిసిపోయారు.
దుర్గమ్మను దర్శించుకున్న సంగీత దర్శకుడు కోటి
సంగీత దర్శకుడు కోటి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్ళారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆయనకు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఆలయ ఈవో డి.భ్రమరాంబ లడ్డూ ప్రసాదం, కుంకుమ బహూకరించారు. పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం అందించారు.
కరోనా నిబంధనలు బేఖాతరు
రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఎవరూ కరోనా నిబంధనలు పాటించడం లేదు. ఆదివారం దుర్గమ్మ దర్శనానికి భారీగా వచ్చిన భక్తుల్లో కొద్దిమంది మినహా మిగిలిన వారు మాస్క్ ధరించలేదు. శానిటేజర్లు వినియోగించలేదు.