దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
ABN , First Publish Date - 2022-10-03T12:39:02+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు శ్రీ దుర్గాదేవి
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుర్గాదేవి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు.
కాగా.. నిన్న అర్ధరాత్రి వరకూ అమ్మవారి దర్శనాలు కొనసాగాయి. సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 12 గంటలకు దర్శనం నిలిపివేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పది నిమిషాల పాటు ఇంద్రకీలాద్రిపై గందరగోళం నెలకొంది. కలెక్టర్, సిపి, ఆలయ ఈఓ చర్చించుకుని ఒంటిగంట వరకూ భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు మరో గంట పాటు అధికారులు దర్శన సమయం పెంచారు. ఒంటి గంట వరకూ భక్తులను అనుమతించి క్యూ లైన్లను అధికారులు ఖాళీ చేయించారు. పది వేల మంది వరకూ కొండ కింద వినాయకుని గుడి దగ్గరే ఆగిపోయారు.