జజ్జనకరి జనాలే.. జగజ్జననికి బోనాలే..
ABN , First Publish Date - 2022-07-04T06:12:53+05:30 IST
జజ్జనకరి జనాలే.. జగజ్జననికి బోనాలే..
కనకదుర్గమ్మకు భాగ్యనగర్ భక్తుల బంగారు బోనం
1,000 మందితో జాతరగా ఇంద్రకీలాద్రికి..
ప్రధాన ఆకర్షణగా బేతాళ విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు
భక్తుల రాకతో కొండంతా పండుగ..
కనకప్రభలతో కొలువుదీరిన కనకదుర్గమ్మ బంగారు కాంతులను ప్రసరించింది. భాగ్యనగర్ భక్తుల బంగారు బోనాన్ని స్వీకరించి కటాక్షించింది. బేతాళ కళాకారుల విన్యాసాలు.. తప్పెటగుళ్ల నృత్యాలు.. కోలాటాల కోలాహలం నడుమ జాతరను తలపించేలా జరిగిన ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు అశేష జనవాహిని ఆదివారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చింది.
వన్టౌన్, జూలై 3 : భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. వన్టౌన్లోని బ్రాహ్మణవీధి వద్ద ఉన్న జమ్మిదొడ్డి ప్రాంగణం నుంచి కొండపై వరకు జాతరగా తరలివచ్చారు. దాదాపు వెయ్యిమంది భక్తులతో రకరకాల బాజాభజంత్రీలు, మేళతాళాలు, బేతాళ విన్యాసాలతో ఉత్సవం కనులపండువగా సాగింది. కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారీ, గౌరవాధ్యక్షుడు గాజుల అంజయ్య, ప్రతినిధులు, సభ్యులు తరలివచ్చారు. అలాగే, కొత్తపేటలోని వేణుగోపాలస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు.