అమ్మ ప్రసాదం
ABN , First Publish Date - 2020-03-29T09:24:40+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని..
అన్నార్తులకు దుర్గమ్మ ఆహార పొట్లాల పంపిణీ
విజయవాడ(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని యాచకులు, భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదలు, రోడ్లపై నివసించే అభాగ్యులకు దుర్గమ్మ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దుర్గమ్మ దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో దేవస్థానంలోని అన్ని విభాగాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు. అయితే, నగరంలోని నిరుపేదలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు నెలకొనడంతో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేయాలని దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులు నిర్ణయించారు.
రోజూ 2వేల ప్యాకెట్ల దద్ద్యోజనం, మరో 2వేల ప్యాకెట్ల కదంబం తయారుచేసి పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 4వేలు, సాయంత్రం 4వేలు చొప్పున ఆహార పొట్లాలను తయారు చేసి వీఎంసీ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నామని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్బాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పరిస్థితులను బట్టి లాక్డౌన్ అమల్లో ఉన్నంతకాలం ఈ ప్రసాదం అందజేస్తామని ఆయన చెప్పారు.