దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర
ABN , First Publish Date - 2021-10-17T05:26:36+05:30 IST
జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు.
ఏసీసీ, అక్టోబరు 16: జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో శనివారం నిర్వహించిన దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర ఆకట్టుకుంది. 9 రోజుల పాటు పూజలందుకున్న దుర్గామాతను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు పట్టణంలోని పలు మండపాల నుంచి శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భక్తి ఆడి పాట దుర్గాదేవికి వీడ్కోలు పలికారు. శోభాయాత్రలో మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, పీఏసీఎస్ మెంబర్ తూముల వెంకటేష్, పోశమల్లు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని విశ్వనాధ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన భజన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, సభ్యులు రీనారాణిదాస్, బోడ ధర్మేందర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాదర్ల సతీష్, శశి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీలో దుర్గాదేవి నవరా త్రులు ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు పూజలందుకున్న అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఆయా మండళ్ళ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అలంకరణతో ఉరేగింపు ప్రారంభించారు. నాగార్జున కా లనీ, గోదావరి కాలనీ, రాంనగర్, శ్రీరాంపూర్ కాలనీలతో అమ్మవార్లను నిమజ్జనం కొరకు ఉరేగింపు జరిగింది. పట్టణ పురవీధుల మీదుగా ఉరేగింపు కొనసాగింది. నిర్వహకులు అమ్మవారి విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.
లక్షెట్టిపేట: పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నెలకొల్పిన దుర్గామాతకు శనివారం పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పట్టణ వాసులు తెల్లటి వస్ర్తాల డ్రెస్కోడ్తో పాల్గొనడం పలువుర్ని ఆకర్షించింది. ఈ శోభాయాత్ర పట్టణంలోని గాంధీబొమ్మ, పాత బస్టాండ్ల మీదుగా గోదావరి నది వరకు కొనసాగింది. అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఆలయ నిర్వహకులు, పట్టణ పెద్దలు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్: పట్టణంలోని వేంకటేశ్వ రాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద శుక్రవారం విజయదశమి సందర్భంగా హోమయజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ దంపతులు పాల్గొని పూజలు చేశారు. అలాగే పట్టణంలోని వివిధ కాలనీల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలను శనివారం నిమజ్జనానికి ఊరేగింపుగా తరలించారు. స్ధానిక మూడవ జోన్లో నెలకొల్పిన దుర్గామాత శోభాయాత్ర సందర్భంగా మహిళలు నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి సాగనంపారు. రామన్ కాలనీలో గుర్రం వాహనంలో ప్రత్యేకంగా దుర్గామాత నిమజ్జనానికి తరలించారు. అనంతరం నిమజ్జనం కోసం మంచిర్యాల గోదావరికి తరలించారు. సీఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మందమర్రిరూరల్, అక్టోబరు 16 : స్ధానిక రెండవ జోన్లోని స్ట్షేషన్ రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను శనివారం నిమజ్జనానికి తరలించారు. అంతకుముందు దుర్గామాతకు పూజలు నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించగా భుక్తలు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మంగళహారతులు పట్టారు. అనంతరం గోదావరి నదికి నిమజ్జనానికి తరలించారు. ఆలయ పూజారీ కుశకుమారచారి, భక్తులు భవానీ, జయ, సాయివర్షిత్, శశికాంత్, భక్తులు పాల్గొన్నారు.
జన్నారం: ముండలంలోని ఆయా గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. దుర్గామాత మండలి సభ్యులంతా అదిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్ధానిక గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుతారి వినయ్ తదితరులు పాల్గొన్నారు.