దుర్గగుడిలో పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-12T06:42:24+05:30 IST

: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేదోక్తంగా గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఈవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్‌, ఆర్‌.శ్రీనివాసశాస్త్రి తదితరులు ఊరేగింపుగా పవిత్రాలను తీసుకువచ్చారు.

దుర్గగుడిలో పవిత్రోత్సవాలు ప్రారంభం

వన్‌టౌన్‌, ఆగస్టు 11 : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేదోక్తంగా గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఈవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్‌, ఆర్‌.శ్రీనివాసశాస్త్రి తదితరులు ఊరేగింపుగా పవిత్రాలను తీసుకువచ్చారు. ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పవిత్రాల పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అగ్నిప్రతిష్ఠాపన సర్వప్రాయశ్చిత్త విధులు నిర్వహించి పవిత్రమాలలను మూలవిరాట్టులకు, దేవతా మూర్తులకు ధరింపచేశారు. అమ్మవారికి సుగంధ పరిమళాలు, పవిత్ర కృష్ణానదీ జలాలతో స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటల నుంచి అనుమతించారు. శుక్రవారం యధావిధిగా ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి పూర్ణాహుతి అనంతరం కలశోధ్వాసన, పవిత్ర విసర్జన కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు సమాప్తమవుతాయి. అర్జిత సేవలు శనివారం నుంచి ప్రారంభమవుతాయి.దుర్గమ్మవారిని గురువారం దేవదాయ శాఖ, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ప్రొటోకాల్‌ మేరకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేదశీర్వాచనం చేశారు. ఈవో భ్రమరాంబ ప్రసాదం, శేషవస్త్రాలను అందచేశారు. 

Updated Date - 2022-08-12T06:42:24+05:30 IST