దుర్గా మండపంలో.... ‘మహిళా కూలీల అవస్థలు’
ABN , First Publish Date - 2020-10-17T16:29:53+05:30 IST
పశ్చిమబెంగాల్లో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు కట్టుబాట్ల నడుమ శరన్నవరాత్రులు...
కోల్కతా: పశ్చిమబెంగాల్లో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు కట్టుబాట్ల నడుమ శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో కోల్ కతాలో ఏర్పాటు చేసిన ఒక దుర్గామండపం అందరినీ విశేషంగా అలరిస్తోంది. బెహాలా బారిష్ క్లబ్లో అత్యంత విచిత్ర రీతిలో దుర్గా పూజలు నిర్వహిస్తున్నారు. ఈసారి దుర్గామాత విగ్రహం స్థానంలో తన పిల్లలతో పలు అవస్థలు పడుతున్న మహిళ విగ్రహాన్ని నిలిపారు. లాక్డౌన్లో శ్రామిక మహిళ పడుతున్న కష్టాలను ప్రతిబింబించేలా ఈ ప్రతిమను రూపొందించారు.
లాక్డౌన్ సమయంలో ఒక శ్రామిక మహిళ తన పిల్లలను తీసుకుని వేల కిలోమీటర్లు నడుస్తున్న రీతిలో ఈ ప్రతిమ కనిపిస్తుంది. ఈ ప్రతిమను రూపొందించిన కళాకారుడు రింకూ దాస్ మాట్లాడుతూ వలస కూలీలను పరిశీలనగా చూసినపుడు తనకు ఇలాంటి ప్రతిమ రూపొందించాలని అనిపించిందన్నారు. నలుగురు పిల్లలను తీసుకుని దీనంగా వెళుతున్న మహిళను చూసినపుడు ఎంతో ఆవేదన కలిగిందన్నారు.