చాపరాలపల్లిలో దుప్పి మాంసం విక్రయం
ABN , First Publish Date - 2021-07-18T05:07:21+05:30 IST
వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన దుప్పిని కూలీలు వాటాలు పంచుకొని ఇంటికి తీసుకెళ్లిన ఘటనపై ఒకరోజు ఆలస్యంగా కేసు నమోదైంది.
తొమ్మిది మంది కూలీలపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు
ఒకరోజు ఆలస్యంగా కేసు నమోదు చేయడంపై అనుమానాలు
ములకలపల్లి, జులై 17: వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన దుప్పిని కూలీలు వాటాలు పంచుకొని ఇంటికి తీసుకెళ్లిన ఘటనపై ఒకరోజు ఆలస్యంగా కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మండల పరిధిలోని చాపరాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం కొంతమంది కూలీలు వరిపొలంలో నాటు వేస్తుండగా అటుగా ఓ దుప్పిని వీధి కుక్కలు తరుముకుంటూ వచ్చి దాడి చేశాయి. ఈ వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన దుప్పి కళేబారాన్ని కూలీలు తమ వెంట తీసుకెళ్లి మాంసాన్ని వాటాలుగా పంచుకొని ఇంటికి తీసుకెళ్లారు. అయితే వాటాల పంపకంలో విభేదాలు తలెత్తడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దాంతో కొందరు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటనలో అటవీశాఖ అధికారులకు, మాంసం విక్రయదారులకు మధ్య సయోధ్య కుదరకపోవడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ఈ ఘటనలో 9మంది కూలీలపై అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేశారు.