కరోనాతో కన్నుమూశాడని... మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలి...
ABN , First Publish Date - 2021-04-11T15:33:32+05:30 IST
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మరింత భీతావహంగా...
రాంచీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మరింత భీతావహంగా మారుతోంది. కరోనా బారిన పడుతున్నవారి సంఖ్యతో పాటు కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. జార్ఖండ్లోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. దుమ్కాలో ఒక వ్యక్తి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశాడు. ఆ తరువాత అతని మృతదేహం రెండు రోజుల పాటు దుమ్కా మెడికల్ కాలేజీలోనే ఉండిపోయింది. దీనిని గమనించిన అక్కడి బాధితులు ఈ విషయమై వైద్యాధికారులను ప్రశ్నించడంతో వారు వెంటనే స్పందించి మృతదేహాన్ని పోస్టుమార్టం హౌస్కు తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుమ్కాకు చెందిన ఒక రోగిని అతని బంధువులు డీఎంసీహెచ్కు తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించేలోగానే ఆ వ్యక్తి మృతి చెందాడు.
దీనిని గమనించిన బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడున్నవారు ఈ విషయాన్ని వైద్యులకు చెప్పారు. దీంతో వారు ఆ వ్యక్తిని పరీక్షించి మృతి చెందాడని నిర్థారించారు. తరువాత ఆ మృతదేహానికి కరోనా టెస్ట్ చేశారు. దీంతో అతను కరోనా కారణంగానే మృతి చెందాడని తేలింది. దీంతో వైద్యులు ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్చేసి, ఆసుపత్రి వర్గాలకు అప్పగించారు. రెండు రోజుల పాటు ఆ మృతదేహం అక్కడే ఉంది. దీనిని గమనించిన అక్కడి రోగులు ఆందోళన చేయడంతో, ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం హౌస్కు తరలించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. కాగా కరోనా మృతునికి మున్సిపల్ విభాగం సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.