పెళ్లయిన ఏడాదికే..
ABN , First Publish Date - 2020-07-06T16:52:28+05:30 IST
పెళ్లయిన ఏడాదికే జిల్లాకు చెందిన..
రోడ్డు ప్రమాదంలో జిల్లా యువకుడి మృతి
భార్య నిండు గర్భిణి
దూకలపాడులో విషాదం
పూసపాటిరేగ/నరసన్నపేట(శ్రీకాకుళం): పెళ్లయిన ఏడాదికే జిల్లాకు చెందిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. నిండు గర్భిణి అయిన భార్యను ఆస్పత్రిలో చేర్పించేందుకు బైక్పై వస్తూ ఆగిఉన్న లారీని ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూస పాటిరేగ మండలం పేరాపురం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట మండలం దూకలపాడు గ్రామానికి చెందిన అల్లు అమ్మన్నాయుడు (29) అనే యువకుడు విశాఖ జిల్లా పరవాడలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
ఏడాది కిందటే వనిత అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం వనిత నిండు గర్భిణి. ఈమె తన కన్నవారింటి వద్ద ఉంటుంది. డెలివరీ తేదీ సమీపించడంతో భార్యను ఆస్పత్రిలో చేర్పించేందుకు అమ్మన్నాయుడు తన బైక్పై పరవాడ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. పేరాపురం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగిఉన్న లారీని ఢీకొన్నాడు. దీంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పరిశ్రమకు చెందిన అంబులెన్స్లో విజయనగరం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు.
అమ్మన్నాయుడుకు తల్లిదండ్రులు లక్ష్మి, రాములు ఉన్నారు. స్థానిక ఎస్ఐ బాలాజీరావు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మన్ననాయుడు మృతితో దూకలపాడులో విషాదచాయలు అలముకున్నాయి.