IndiGo విమానంలో సాంకేతిక లోపం... కరాచీకి మళ్లించిన అధికారులు...
ABN , First Publish Date - 2022-07-17T15:37:16+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది
న్యూఢిల్లీ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని షార్జా (Sharjah) నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని పాకిస్థాన్లోని కరాచీకి మళ్ళించారు. ఇది హైదరాబాద్ వెళ్లవలసి ఉంది. ఈ విమానంలోని ప్రయాణికులను హైదరాబాద్ చేర్చేందుకు మరొక విమానాన్ని పంపిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.
ఇండిగో ఆదివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, షార్జా-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ విమానాన్ని పాకిస్థాన్ (Pakistan)లోని కరాచీకి మళ్ళించారు. ఈ విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళేందుకు మరొక విమానాన్ని పంపిస్తున్నారు.
గడచిన రెండు వారాల్లో ఈ విధంగా అత్యవసరంగా దిగిన రెండో భారతీయ విమానం ఇది. ఇటీవల ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్ళేందుకు బయల్దేరిన స్పైస్జెట్ (SpiceJet) విమానం కరాచీలో అత్యవసరంగా దిగింది. ఈ విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు జరుపుతోంది.