కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల విషయంలో Dubai కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2021-11-18T17:03:43+05:30 IST
దుబాయి వృద్ధిని మరింత పెంచడానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌరులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు ఐదేళ్ల మల్టీ ఎంట్రీ వీసాలను జారీ చేయడాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు ఈ వీసాలను పొందడం ద్వారా ప్ర
ఎన్నారై డెస్క్: దుబాయ్ వృద్ధిని మరింత పెంచడానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌరులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు ఐదేళ్ల మల్టీ ఎంట్రీ వీసాలను జారీ చేయడాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు ఈ వీసాలను పొందడం ద్వారా ప్రయోజనం పొందొచ్చని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఉద్యోగులు మల్టీ ఎంట్రీ వీసా తీసుకోవడం ద్వారా దుబాయ్కి సులభంగా ప్రయాణించొచ్చని తెలిపారు. దీంతో దుబాయ్లో జరిగే కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్లు, మీటింగ్లకు ఉద్యోగులు హాజరుకావొచ్చని వెల్లడించారు. కాగా.. మల్టీ ఎంట్రీ వీసా పొందిన ఉద్యోగులకు.. విజిట్ చేసిన ప్రతిసారి సుమారు 90 రోజులపాటు దుబాయ్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీన్ని మరో 90 రోజుల వరకూ పొడగించుకోవచ్చు. అయితే ఈ వీసా పొందేందుకు సుమారు 650 దిర్హమ్లను చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. మల్టీ ఎంట్రీ వీసా కోసం ఉద్యోగులు సంబంధిత వెబ్సైట్లో ముందుగా తమ పేరు, సర్వీస్ డిటేయిల్స్తోపాటు యూఏఈలోని అడ్రస్, యూఏఈలో కాకుండా వేరే ఏ ప్రాంతములో అయినా నివసిస్తుంటే ఆ చిరునామాను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు కలర్ ఫొటో, పాస్పోర్ట్ కాపీ, మెడికల్ ఇన్సురెన్స్, గత ఆరు నెలలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలించి.. మెయిల్ ద్వారా వీసాను జారీ చేస్తారు.