ఉరుసు ఉత్సవాలు రద్దు.. ఏకాంతంగా పూజలు
ABN , First Publish Date - 2020-10-28T06:20:30+05:30 IST
మండలంలోని కొత్తలంకలో ఈనెల29 నుంచి నిర్వహించాల్సిన వలీబాబా ఉరుసు ఉత్సవాలను కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్టు అమలాపురం డీఎస్పీ షేక్ మసూంభాషా తెలిపారు.
ముమ్మిడివరం, అక్టోబరు 27: మండలంలోని కొత్తలంకలో ఈనెల29 నుంచి నిర్వహించాల్సిన వలీబాబా ఉరుసు ఉత్సవాలను కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్టు అమలాపురం డీఎస్పీ షేక్ మసూంభాషా తెలిపారు. డీఎస్పీ మసూంభాషా, ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్లు మంగళవారం వలీబాబా దర్గాను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా దర్గా వద్ద పూజా కార్యక్రమాలు ఏకాంతంగా జరుగుతాయని, భక్తులకు అనుమతిలేదన్నారు. బాబాకు పూజచేసిన గంథాన్ని భక్తులకు పంపిణీ చేయడం జరగదని, తీర్థం జరగనందున పూజాసామగ్రి విక్రయకేంద్రాలు, స్వీట్స్టాల్స్, హోటల్స్ వంటివాటికి అనుమతి లేదన్నారు. ఊరేగింపునకు అనుమతి లేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాలకు ఎటువంటి అనుమతి ఇవ్వమని చెప్పారు. దర్గా వద్ద భక్తులకు ఎటువంటి వసతి సౌకర్యం కల్పించడం జరగదని ఆయన చెప్పారు. డీఎస్పీ సమక్షంలో పోలీసులు దర్గా వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేశారు. ముమ్మిడివరం ఎస్ఐ కేవీ నాగార్జున, పోలీసులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
రావులపాలెం రూరల్, అక్టోబరు 27: లారీ ఓనర్స్ యూనియన్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఏదైనా సమస్య వచ్చినపుడు యూనియన్ల సభ్యులందరూ ఏకతాటిపైకి వచ్చి సమస్య పరిష్కారానికి కృషిచేయాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో శ్రీవిజయలక్ష్మి విజయదుర్గ లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో గౌరవ అధ్యక్షుడిగా కర్రి నాగిరెడ్డి, అధ్యక్షుడిగా మేడపాటి శ్రీనివాసరెడ్డి, సెక్రటరీగా మానే నారాయణరావులను ఎన్నుకున్నారు. జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి వానపల్లి స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, అమలాపురం, రాజోలు, రాజమహేంద్రవరం, మండపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.