ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి

ABN , First Publish Date - 2020-09-25T11:36:14+05:30 IST

ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి

ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి

 నేటి నుంచి పోస్టింగ్‌కు కౌన్సెలింగ్‌


విశాఖపట్నం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ 2018లో సెకండరీగ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. నగరంలోని వసంతబాలవిహార్‌ పాఠశాలలో గురువారం ఉదయం నుంచి ధువ్రపత్రాల పరిశీలనకు 158 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు రాకుండా ఉండిపోయిన అభ్యర్థులు వచ్చారు. జిల్లాలో ఎస్జీటీ కేటగిరీలో విద్యాశాఖ, మునిసిపాలిటీ, ఐటీడీఏ పరిధిలో 633 ఖాళీలకు 2018లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పరీక్షలలో 48 మంది అభ్యర్థులు జీవీఎంసీ, విద్యాశాఖలో పోస్టులకు ఎంపికయ్యారు. కాగా గతంలోనూ, గురువారం కలిపి సర్టిఫికెట్ల పరిశీలనకు మొత్తం 425 మంది వచ్చారు. వీరిలో ఏజెన్సీలో 112, మైదానంలో 258, జీవీఎంసీలో 67, ఐటీడీఏలో 78 పోస్టులకు అభ్యర్థులు వచ్చారు.


మరో 12 మంది గైర్హాజరు కాగా, ఒకరి ధ్రువపత్రాలు తిరస్కరించారు. మరో 15 మందివి పెండింగ్‌లో ఉంచారు.  శుక్రవారం నుంచి ఎంపికైన అభ్యర్థుల పోస్టింగ్స్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మైదాన ప్రాంతానికి ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం ఉదయం నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని డీఈవో బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి ఎంపికైన వారికి 26వ తేదీన పోస్టింగ్స్‌ ఇస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు, విద్యాశాఖ ఇచ్చే చెక్‌ లిస్టు, మూడు పాస్‌పోర్టుసైజు ఫొటోలు తీసుకు రావాలన్నారు. జీవీఎంసీ, పాడేరు ఐటీడీఏ పరిధిలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆయా యాజమాన్యాలు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయన్నారు. కాగా గురువారం నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌, ఏడీ రవికుమార్‌ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2020-09-25T11:36:14+05:30 IST