రోడ్డుపై ధాన్యం ఆరబెట్టొద్దు
ABN , First Publish Date - 2022-05-19T05:06:21+05:30 IST
రోడ్డుపైన ధాన్యం ఆరబెట్టి రాత్రి వేళల్లో బొడ్డెలు కట్టడంతో ప్రమాదాలు జరిగి మృత్యు వాత పడుతున్నారు.
- మృతుని కుటుంబ సభ్యుల ధర్నా
కోడేరు, మే 18: రోడ్డుపైన ధాన్యం ఆరబెట్టి రాత్రి వేళల్లో బొడ్డెలు కట్టడంతో ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. రోడ్లపైన ధాన్యం ఆరబెట్టరాదని వాటిని వెంటనే తొలగించాలని మృతుని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. బుధవారం మండల పరిధిలోని జనుంపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శేషయ్య కుటుంబ సభ్యు లు మృతి చెందిన స్థలంలో బైఠాయించి నిరసన తెలిపారు. రైతులు ధాన్యం రోడ్లపై ఆరబెట్టి సైడ్కు రాళ్లు, కవర్లు వేయడంతో ఎదురుగా వచ్చిన వాహనాలకు సైడ్ లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయం అధికారులకు చెప్పినా చూసీచూడనట్లుగా వ్యవహరించడం తో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నెల 9వ తేదీ రాత్రి 8 గంటలకు కోడేరు నుంచి జనుంపల్లికి బైక్పై వెళ్తున్న శేషయ్య యాక్సిడెంట్ జరిగి చనిపోయిన విషయం పాఠకు లకు విదితమే. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు వచ్చి ధాన్యం వెంటనే ఖాళీ చేయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అధికారులు స్పందించి రోడ్లపై ధాన్యం వేయకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.