ఇక నుంచి కొవిడ్‌ బాధితులకు డ్రై ఫ్రూట్స్‌

ABN , First Publish Date - 2020-08-03T19:45:03+05:30 IST

సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఇక నుంచి రోజూ సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘డ్రై ఫ్రూట్స్‌ లేవు.. పాలు ఇస్తలేరు‘ శీర్షికన ఆదివారం

ఇక నుంచి కొవిడ్‌ బాధితులకు డ్రై ఫ్రూట్స్‌

జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డును పరిశీలించిన కలెక్టర్‌ 

ఆదివారం సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ అందజేత


సంగారెడ్డి అర్బన్‌(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఇక నుంచి రోజూ సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘డ్రై ఫ్రూట్స్‌ లేవు.. పాలు ఇస్తలేరు‘ శీర్షికన ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కఽథనానికి కలెక్టర్‌ హన్మంతరావు స్పందించి, ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డును పరిశీలించారు. కొవిడ్‌ రోగులతో ఫోన్‌లో మాట్లాడారు. వాళ్లకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, చికిత్స, మందులు తదితర విషయాల గురించి ఆరా తీశారు. 


డ్రై ఫ్రూట్స్‌ ఇవ్వడం లేదని తెలుసుకున్న కలెక్టర్‌ వెంటనే అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డిని ఆదేశించారు. ఆ మేరకు ఆస్పత్రి అధికారులు ఆదివారం సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ అందజేశారు. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులతో వైద్య సేవలను అందించాలని  కలెక్టర్‌ వైద్యులకు సూచించారు. కరోనా పేషెంట్లను ఆత్మీయంగా పలకరిస్తూ వారిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సూచించారు. రోగులతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్‌.. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు. కలెక్టర్‌ వెంట సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.సంగారెడ్డి, ఆర్డీవో నగేష్‌, తహసీల్దార్‌ స్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-08-03T19:45:03+05:30 IST