ఆరుతడి పంటలే సాగు చేయాలి
ABN , First Publish Date - 2021-12-09T04:57:44+05:30 IST
ఆరుతడి పంటలే సాగు చేయాలి
పెద్దేముల్/దౌల్తాబాద్/కొడంగల్/మోమిన్పేట: యాసంగిలో రైతులు వరి సాగుచేయొద్దని, ఆరుతడి పంటలే వేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం పెద్దేముల్ మండలం మంబాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడి రైతులతో మాట్లాడారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయదన్నారు. రైతులు ఇబ్బంది పడేకంటే పెసర, మినుము, వేరుశనగ, జొన్నలు, నువ్వు పంటలు పండించాలని కోరారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రేగొండి శ్రవణ్కుమార్, ఏరువాక శాస్త్రవేత్త ఎన్.ప్రవీణ్, డీఏవో గోపాల్, ఏడీఏ శంకర్రాథోడ్, ఏఈవో బాలు పాల్గొన్నారు. దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో యాసంగి పంటలపై అవగాహన కల్పించారు. జొన్న, పెసర్లు, ఆముదం, పొద్దుతిరుగుడు, వేరు శనగ, శనగ, ఆవాలు తదితర పంటలను సాగుచేయాలన్నారు. ఏఈవో పట్నం శ్రీపతిరెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీ నారాయణ, రైతులు పాల్గొన్నారు. కొడంగల్ మండలం ఆలేడ్లో రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ నవీన్కుమార్, డాక్యనాయక్ మాట్లాడారు. మోమిన్పేట మండలం టేకులపల్లి క్లస్టర్ ఏఈవో శశాంక్ మక్తతాండ, దుర్గంచెర్వు, ఇజ్రాచిట్టంపల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవో.. మాట్లాడుతూ యాసంగిలో వరి సాగు చేస్తే ప్రభుత్వాలు కొనడం లేదన్నారు. కూరగాయలు, పప్పు దినుసులు, జొన్నలు, గోధుమ వేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ సరస్వతి, ఏఈవోలు మౌనిక, నీరజ, రైతులు పాల్గొన్నారు.