Drunken and Driveలో వాహనాన్ని ఆపి పోలీసులు వేధిస్తున్నారని వాహనానికి నిప్పు
ABN , First Publish Date - 2022-01-04T11:55:36+05:30 IST
Drunken and Driveలో వాహనాన్ని ఆపి పోలీసులు వేధిస్తున్నారని వాహనానికి నిప్పు
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : డ్రంకెన్ డ్రైవ్లో వాహనాన్ని ఆపిన పోలీసులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు. నాంపల్లి పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నాంపల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రైల్వేస్టేషన్ రోడ్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫస్ట్ లాన్సర్కు చెందిన సజ్జత్ ఆలీ ఖాన్(30) తన బజాజ్ చేతక్పై వెళ్తున్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఆపి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్లు తేలింది. ప్రభుత్వం ఒక వైపు మద్యం షాపులు తెరిచి ఉంచుతుందని, మరో వైపు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పేరుతో వేధిస్తున్నారని అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో అలీఖాన్ కోపంతో జేబులోని లైటర్ తీసి వాహనానికి నిప్పంటించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంటలను ఆర్పేసిన ట్రాఫిక్ పోలీసులు అతడిపై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనం వద్ద నిల్చుని సిగరెట్ అంటించుకోవడం వల్ల నిప్పు అంటుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు లా అండ్ ఆర్డర్ పోలీసులు తెలిపారు. దీనిపై నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు కనీసం ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిసింది.