దళితులకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2020-06-03T11:08:39+05:30 IST
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు ..
రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు
నెల్లూరు (వీఆర్సీ), జూన్ 2 : రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారని, సంకెళ్లకు తాము భయపడమని దళిత నేతలు పేర్కొన్నారు. నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు సుధాకర్పై జరిగిన దాడిని నిరసిస్తూ నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో మంగళవారం ఎస్సీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకట రమణ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు.
కోవిడ్-19 విధుల్లో ఉన్న వారికి మాస్క్లు కావాలని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు పంటలు పండే దళితుల భూములను లాక్కుని ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై మండిపడ్డారు. అమెరికాలో జాత్యహంకారంతో పోలీసులు హత్య చేస్తే పరిణామాలు ఎలా ఉన్నాయో ప్రపంచమంతా చూస్తోందని, అలాగే దళితులకు అన్యాయం చేసి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు బద్దెపూడి రవీంద్ర, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాబు, పల్లం వెంకయ్య, దార్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు.