ప్రభుత్వాస్పత్రుల్లో వసతులు కరువు

ABN , First Publish Date - 2022-01-29T06:26:49+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల లేమితో పాటు వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో నిత్యం 500కుపైగా ఓపీ నమోదవుతోంది. అయితే ఇక్కడ మౌలిక వసతులు కరువయ్యాయి. జనరల్‌ ఆస్పత్రిలో తాగునీటికి సమస్య తీవ్రంగా ఉంది.

ప్రభుత్వాస్పత్రుల్లో వసతులు కరువు
జనరల్‌ ఆస్పత్రిలో మూలనపడిన వాటర్‌ కూలర్‌

కోదాడలో వైద్యుల కొరత

తాగు నీరులేక ఇబ్బందులు పడుతున్న రోగులు



సూర్యాపేటటౌన్‌, కోదాడ, జనవరి 28: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల లేమితో పాటు వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో నిత్యం 500కుపైగా ఓపీ నమోదవుతోంది. అయితే ఇక్కడ మౌలిక వసతులు కరువయ్యాయి. జనరల్‌ ఆస్పత్రిలో తాగునీటికి సమస్య తీవ్రంగా ఉంది. పలు సేవా, స్వ చ్ఛంద సంస్థలు వాటర్‌ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసినా, వీటిలో కొన్ని మరమ్మతుకు గురికాగా పూర్తిస్థాయిలో రోగులకు ఉపయోగపడటంలేదు. దీంతో రోగులు రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నారు. అంతేగాక రోగుల సహాయకులు కూర్చునేందుకు కనీస ఏర్పాట్లు లేవు. దీంతో వారు చెట్ల కిందనే సేద తీరడంతోపాటు, భోజనాలు చేస్తున్నారు. పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో ఆస్పత్రిలో ఇష్టానుసారంగా వాహనాలను నిలుపుతున్నారు. ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లే గేటు వద్ద ఇనుప గ్రిల్స్‌ తుప్పుపట్టి ప్రమాదకరంగా మారాయి. గతంలో ఓ రోగి సహాయకుడి కాలు ఈ గ్రిల్స్‌లో ఇరుక్కొని గాయాలపాలయ్యాడు. ఇక్కడి సిబ్బంది ఇన్‌పేషెంట్‌ డిశ్చార్జి సమయంలో ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


కోదాడలో ముగ్గురే వైద్యులు

కోదాడలో 30 పడకల ఆస్పత్రి ఉండగా, వైద్యుల కొరత ఉంది. రోజుకు సు మారు 150 మంది ఓపీ నమోదవుతుండగా, మొత్తం 16 మంది డాక్టర్లకుగాను ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆస్పత్రిని సిబ్బంది కొరత సైతం వేధిస్తోం ది. జనరేటర్‌ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ పోయినప్పుడు రోగులకు చికిత్స అందించలేకపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆస్పత్రికి వచ్చే విద్యుత్‌ కేబుల్‌ లైన్‌ సరిగా లేక సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. గత ఏడాది నవంబరు మాసంలో విద్యుత్‌ వైర్లు దగ్ధం కాగా, ఫ్యాన్లు తిరగడం లేదు. విద్యుత్‌ కేబుల్‌ లైన్‌ కోసం రూ.4లక్షలు అవసరమని ఆస్పత్రి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినా నిధులు విడుదల కాలేదు.


ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నాం : మురళీధర్‌రెడ్డి, సూర్యాపేట ఆస్పత్రి సూపరింటెండెంట్‌

జనరల్‌ ఆస్పత్రిని ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోంది. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో వైద్య సిబ్బంది కొరత తీరి రోగులకు మెరుగైన చికిత్స అందుతోంది. ఇప్పటికే 350 పడకలు ఉండగా, మరో 20 పడకలను ప్రారంభించేందుకు సిద్ధం చేశాం.

Updated Date - 2022-01-29T06:26:49+05:30 IST