రోడ్డున పడేశారు

ABN , First Publish Date - 2020-11-29T06:04:51+05:30 IST

కరోనా సమయంలో సేవలు అందించేందుకు తీసుకున్న 500 మంది స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లను అధికారులు రాత్రికి రాత్రి తొలగించారు.

రోడ్డున పడేశారు
కలెక్టరేట్‌లో స్టాఫ్‌ నర్సుల ఆందోళన

కొవిడ్‌ సేవలకు తీసుకున్న 500 మంది స్టాఫ్‌ నర్సుల తొలగింపు

ఆరు నెలలు కాలానికి తీసుకుని అర్ధంతరంగా తీసేయడంపై ఆందోళన

మూడు నెలలైనా ఒక్క రూపాయి కూడా చెల్లించని వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా సమయంలో సేవలు అందించేందుకు తీసుకున్న 500 మంది స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లను అధికారులు రాత్రికి రాత్రి తొలగించారు. ఆరు నెలల పాటు పనిచేయాల్సి వుంటుందని అందరి వద్దా ఒప్పంద పత్రాలను తీసుకున్న అధికారులు...అంతకంటే ముందుగానే కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రోడ్డునపడేశారు. కరోనా బాధితుల దగ్గరకు వెళ్లడానికి కుటుంబ సభ్యులే భయపడినటువంటి తరుణంలో సేవలు అందించిన తమను చెప్పాపెట్టకుండా తొలగించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా వున్న సమయంలో వైద్య సేవలు అందించేందుకు అధికారులు అప్పటికప్పుడు సిబ్బంది నియామకం చేపట్టారు.ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో పనిచేయడానికి 600 మంది స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లను తీసుకున్నారు. వీరంతా మూడున్నర నెలలుగా సేవలు అందిస్తున్నారు. అయితే శుక్రవారం విధులకు హాజరైన సిబ్బంది...ఇకపై రావాల్సిన అవసరం లేదని ఆయా ఆస్పత్రుల్లోని అధికారులు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. ప్రథమ ఆస్పత్రిలో పనిచేస్తున్న సుమారు 90 మంది సిబ్బందిని రాత్రికి రాత్రే హాస్టల్‌ ఖాళీ చేయాల్సిందిగా చెప్పారు. శనివారం ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం...డబ్బులు చెల్లిస్తే గానీ అందించలేదని, కరోనా సమయంలో కుటుంబానికి దూరంగా వుండి సేవలు అందించిన తమను ఇలా రోడ్డుపై నిలబెట్టడం దారుణమని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ విధులకు ఎంపికైన సిబ్బందికి నెలకు జీతం రూ.24 వేలు చెల్లిస్తామని అధికారులు చెప్పారు. అయితే, వీరంతా విధుల్లో చేరి మూడు నెలలు దాటుతున్నా ఇప్పటికీ రూపాయి చెల్లించలేదు.

Updated Date - 2020-11-29T06:04:51+05:30 IST