రెండో డోసుకు నేడు డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్న వారికి గురువారం రెండో డోసు వేయనున్నట్టు కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు.

రెండో డోసుకు నేడు డ్రైవ్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

మొత్తం 39,111  మందికి వ్యాక్సిన్‌

జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా కౌంటర్లు

తొలి డోసు ఏ టీకా వేయించుకుంటే...రెండో డోసు అదే తీసుకోవాలి

కలెక్టర్‌ వినయ్‌చంద్‌


విశాఖపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్న వారికి గురువారం రెండో డోసు వేయనున్నట్టు కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు. ఇందుకోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో తొలి డోసు తీసుకున్న 39,111 మందికి రెండో డోసు వేయాల్సి వుందని గుర్తించామన్నారు. వీరిలో 32,352 మందికి కోవిషీల్డు, 6,759 మందికి కోవాగ్జిన్‌ వేయాల్సి ఉందన్నారు. కోవిషీల్డు తీసుకున్నవారు ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలన్నారు. అదే కోవాగ్జిన్‌ అయితే నాలుగు వారాల తరువాత రెండో డోసు తీసుకోవలసి ఉంటుందన్నారు. రెండో డోసు కోసం గురువారం ఉదయం 7.30 నుంచి రాత్రి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ, జిల్లా, ఏరియా, టీచింగ్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. తొలి డోసు ఏ టీకా వేయించుకుంటే...రెండో డోసు అదే తీసుకోవలసి ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా మరిచిపోతే ఆధార్‌ నంబర్‌ ప్రకారం ఏ టీకా వేసుకున్నది వెల్లడవుతుందన్నారు. తొలి డోసు ఎక్కడ వేసుకున్నా...రెండో డోసు జిల్లాలో ఏ కేంద్రంలోనైనా తీసుకోవచ్చునని కలెక్టర్‌ వివరించారు. తొలి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ గురువారం తమకు సమీపంలో పీహెచ్‌సీ, ఆస్పత్రులకు వెళ్లి ఆధార్‌ కార్డు చూపించాలన్నారు. కొవిడ్‌ సోకి రికవరీ అయిన వ్యక్తులు 90 రోజుల తరువాత టీకా వేయించుకోవాలన్నారు. కొవిడ్‌ బాధితుల వద్ద ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలని, అంతకంటే ఎక్కువ డిమాండ్‌ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సూర్యనారాయణ, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ పాల్గొన్నారు. 


నేడు రెండో డోసు కోవిషీల్డు ఇచ్చే కేంద్రాలు

జీవీఎంసీలోని 72 ఆరోగ్య కేంద్రాలు, మైదానంలోని 47, ఏజెన్సీలోని 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నర్సీపట్నంలో మూడు, ఎలమంచిలిలోని రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని 16 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఇంకా కేజీహెచ్‌, ఘోషా ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రులు


కోవాగ్జిన్‌ టీకా ఇచ్చే కేంద్రాలు

ప్రాంతీయ కంటి ఆస్పత్రి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి, కేజీహెచ్‌లో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, అనకాపల్లి అర్బన్‌ ఫ్యామిలీ సెంటర్‌, నర్సీపట్నం టీబీ కంట్రోల్‌ సెంటర్‌, పాడేరు జిల్లా ఆస్పత్రి

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST