కలలు కనొద్దు!

ABN , First Publish Date - 2021-12-03T08:04:55+05:30 IST

‘దేశంలో అసలు యూపీఏనే లేదు’ అంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వర్గాలు ఘాటుగా స్పందించాయి.

కలలు కనొద్దు!

  • మేం లేకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు
  • మమత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల కౌంటర్‌ 


న్యూఢిల్లీ, డిసెంబరు 2: ‘దేశంలో అసలు యూపీఏనే లేదు’ అంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వర్గాలు ఘాటుగా స్పందించాయి. తమ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని ఆ పార్టీ సీనియర్‌ నేతలు గురువారం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ భాగస్వామ్యం లేని యూపీఏ ఆత్మలేని శరీరంలా ఉంటుందని కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ తలపెట్టిన వివిధ సామాజిక, రాజకీయ అంశాల్లో టీఎంసీని కలుపుకుపోవాలని ప్రయత్నించామని కాంగ్రెస్‌ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ప్రతిపక్షాలు తమలో తాము కొట్లాడుకోకుండా, బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో చేతులు కలపాలని కోరారు. మమత తీరు బీజేపీకి ప్రయోజనం కలిగించేలా ఉందని, ఆమె మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. కాంగ్రె్‌సను బలహీనపర్చేందుకు, పవార్‌ పరువు తీసేందుకు మమత కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మమత ఆక్సిజన్‌ సప్లయర్‌లా తయారయ్యారని మండిపడ్డారు.


కాగా, దేశ రాజకీయాల్లోని వాస్తవికత గురించి అందరికీ తెలుసని, తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీని ఓడించగలమని అనుకుంటే అది కలగానే మిగిలిపోతుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోన్న ‘విభజించి పాలించు’ విధానానికి మద్దతిచ్చే రాజకీయాలకు పాల్పడకూడదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ అన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ప్రతిపక్షానికి నాయకత్వం వహించాలని కాంగ్రెస్‌, టీఎంసీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిరంతర ఐక్య పోరాటం నుంచి ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించింది. 

Updated Date - 2021-12-03T08:04:55+05:30 IST