ఈఐఏ ముసాయిదాను స్థానిక భాషలోకి అనువదించాలంటూ పిటిషన్... కేంద్రానికి హైకోర్టు నోటీసు...
ABN , First Publish Date - 2020-08-07T02:04:03+05:30 IST
ముసాయిదా పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్ను స్థానిక భాషలోకి
చెన్నై : ముసాయిదా పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్ను స్థానిక భాషలోకి అనువదించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఓ మత్స్యకార సంఘం దాఖలు చేసిన ఈ పిటిషన్పై స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ముసాయిదా పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ తుది రూపాన్ని ప్రచురించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు నిరోధించిందని తెలిపారు. దీనిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని శుక్రవారం సవివరమైన విచారణ జరుపుతామని తెలిపింది.
అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారని, వారికి డ్రాఫ్ట్ ఈఐఏ నోటిఫికేషన్ గురించి తెలియదని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ప్రచారం చేయడం లేదని తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారితో ప్రజలు పోరాడుతున్నారని, ఈ సమయంలో ఈ నోటిఫికేషన్పై తమ సలహాలను, అభ్యంతరాలను తెలియజేయలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తమ రాష్ట్రంలో ఎనిమిదిన్నర కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వీరిలో హిందీ, ఇంగ్లిష్ అర్థం చేసుకోగలిగేవారు చాలా తక్కువ ఉన్నారని తెలిపారు. తమిళనాడులో అత్యధికులు గ్రామాల్లో ఉన్నారని, వారికి హిందీ, ఇంగ్లిష్ అర్థం కాబోవని చెప్పారు.