Dr. VL Indiradat: ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి
ABN , First Publish Date - 2022-08-18T14:02:42+05:30 IST
భవిష్యత్తులో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) వ్యాపారులను ప్రోత్సహించాలని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఏసీసీ)
- ఏసీసీ అధ్యక్షురాలు డా.వీఎల్ ఇందిరాదత్
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 17: భవిష్యత్తులో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) వ్యాపారులను ప్రోత్సహించాలని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఏసీసీ) అధ్యక్షురాలు డా.వీఎల్ ఇందిరాదత్(Dr. VL Indiradat) పిలుపునిచ్చారు. గిండిలో బుధవారం ఏసీసీ 94వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీసీ, జర్మనీకి చెందిన ఫ్రైడ్రిచ్ నౌమన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ వ్యాపారులను భవిష్యత్కు సంసిద్ధం చేయడంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటైంది. జ్యోతి వెలిగించి సందస్సును లాంఛనంగా ప్రారంభించిన ఇందిరాదత్ మాట్లాడుతూ... వాణిజ్య రంగాభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన ఆర్ధిక, సాంకేతికత, బ్రాండ్ విలువ, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన చిట్కాలను వివరించారు. మద్రాసు(Madras) ప్రిసీడియంలో 1928 ఆగస్టు 17న స్థాపించిన ఏసీసీ ద్వారా పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి గత 94 సంవత్సరాలుగా సేవలందిస్తున్నామని, తమ సంస్థ శతాబ్ధి ఉత్సవాలు సమీపిస్తున్నాయన్నారు. సికింద్రాబాద్, విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో కూడా తమ శాఖలున్నాయని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రాధాన్యతను దేశానికి వివరిస్తున్నారని, అదే విధంగా తాము కూడా ఎంఎ్సఎంఈలను ప్రోత్సహించేలా కృషిచేస్తున్నట్లు ఇందిరాదత్ తెలిపారు. సౌత్ ఆసియా ఎఫ్ఎన్ఎఫ్ అధినేత డా.కాట్సన్క్లిన్ మాట్లాడుతూ, దేశ ఆర్ధికాభివృద్ధికి చిరు వ్యాపారులు వెన్నెముక వంటివారని అభిప్రాయపడ్డారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు విడతల సమావేశాలుగా సాగిన ఈ సదస్సులో ఏసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఎంకే ఆనంద్, సీనియర్ ఉపాధ్యక్షులు సి.నాగేంద్రప్రసాద్, సీహెచ్ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ డా.ఎంకే ముత్తువేల్, సెక్రటరీ జనరల్ ఆర్.విజయ్కుమార్, జాయింట్ సెక్రటరీ ఎన్.రవికుమార్, డిప్యూటీ సెక్రటరీ కె.బాలసుబ్రమణ్యం, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ కేఎన్ సురే్షబాబు, వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఆర్ధిక నిపుణులు పాల్గొన్నారు.