దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌లో డా.గుడారు జగదీష్ ఉచిత శస్త్ర చికిత్సలు

ABN , First Publish Date - 2021-10-23T02:11:25+05:30 IST

దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌లో డా.గుడారు జగదీష్ ఉచిత శస్త్ర చికిత్సలు

దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌లో డా.గుడారు జగదీష్ ఉచిత శస్త్ర చికిత్సలు

తిరుపతి బర్డ్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ సేవలు తెలంగాణ వాసులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్థో నిపుణులు డాక్టర్ గుడారు జగదీష్ హైదరాబాద్, విద్యా నగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ ద్వారా డా. గుడారు కార్తీక్‌తో కలసి సేవలు అందించనున్నారు. 


పుట్టుకతో వచ్చే అంగ వైకల్యం, సెరిబ్రల్ పాల్సీ, పోలియో వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇకపై హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ లో డా.గుడారు జగదీష్ మరియు డా.గుడారు కార్తీక్ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. గురువారం మరియు శుక్రవారం దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌లో పుట్టుకతో ఏర్పడిన అంగ వైకల్యం, అలాగే పోలియో వంటి వ్యాధులతో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు మొట్టమొదటి సారిగా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. హైదరాబాదులో డా. గుడారు జగదీష్ గారిని సంప్రదించదలచిన వారు 6281422297 నంబరులో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.


ఇప్పటికే హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని “మా ఆర్థోపెడిక్ సెంటర్”లో డా. గుడారు కార్తీక్ సహకారంతో డాక్టర్ జగదీష్ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ అద్యక్షులు శ్రీ ఎస్.వి.రావు గారి కోరిక మేరకు డా.గుడారు జగదీష్ తెలంగాణ ప్రజలకు తన సేవలను విస్తరించేందుకు పూర్తిస్ధాయిలో ఏర్పాట్లు చేశారు.




డాక్టర్ జగదీష్ అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల్లో ఆర్థోపెడిక్ విభాగంలో విశిష్టమైన శిక్షణ పొంది, బంగారు పతకాలను సైతం అందుకున్నారు. పుట్టకతో వచ్చే అంగవైకల్యం మరియు పోలియోతో బాధపడుతున్న చిన్నారులకు స్వస్థత చేకూర్చేందుకు దేశవ్యాప్తంగా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ అన్ని రాష్ట్రాల్లో ఉచిత వైద్య శస్త్రచికిత్స శిబిరాలను నిర్వహించి, లక్షలాది మందిని వారి స్వస్థలాల్లోనే పరీక్షించి, వేలాది మందికి శస్త్రచికిత్సలు చేశారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి పునరావాసం సైతం కల్పించి దివ్యాంగులు సమాజంలో గౌరవ ప్రదంగా, స్వశక్తితో జీవించేలా వారికి మనోధైర్యాన్ని అందిస్తున్నారు.


తిరుపతి లోని బర్డ్ ఆసుపత్రి ని 50 పడకల నుండి 350 పడకలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద శల్యవైద్యశాలగా విస్తరించిన డాక్టర్ జగదీష్ 37 సంవత్సరాల కాలంలో బర్డ్ లో ఒకలక్షా 40 వేలకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు స్వస్థత చేకూర్చారు. 2019 లో బర్డ్ ఆసుపత్రి నుంచి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ప్రజలకు తన సేవలను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో పశ్చిమగోదావరి జిల్లా విర్డ్ ట్రస్టు ఆసుపత్రి, గుంటూరు, విజయవాడ, ఒంగోలు లోని రమేష్ గ్రూప్ హాస్పిటల్స్, వడ్లమూడిలోని డీవీసీ ట్రస్టు ఆసుపత్రి తో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలైన కరేడు, వెంకటగిరి, తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితి కార్యాలయంలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నారు.


దివ్యాంగులకు అత్యున్నతమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించి, వారు సమాజంలో తమ స్వశక్తిపై జీవించేలా చేయాలన్నదే తన ఆశయంగా డా. గుడారు జగదీష్ పేర్కొంటారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని మా ఆర్థోపెడిక్ కేంద్రంలో మోకాలు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత రోగికి ఎటువంటి నొప్పి లేకుండా, శస్త్రచికిత్స చేసిన తర్వాత కేవలం గంట వ్యవధిలోనే రోగి లేచి నిలబడేలా చేయడం జరుగుతుంది. దీని కోసం ఆయన బర్డ్ ఆసుపత్రిలో 2016 లో పరిశోధన చేసి, ఈ విధానంలో ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించిన తర్వాత 2017 నుంచి బర్డ్ ఆసుపత్రిలో రోగులకు ఈ ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని నేటికీ దేశంలోని పలు ఆసుపత్రులలో అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు.


వెన్నుముక సమస్యలతో బాధపడే దాదాపు 2500 మందికి పైగా రోగులకు శస్త్రచికిత్సలను నిర్వహించి వారు తమ పనులు తామే చేసుకునేలా చేయడంలో డాక్టర్ గుడారు జగదీష్ కృషి ఎనలేనిది. ప్రస్తుత సమాజంలో చాలా మంది మోకాలు కీళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. వారికి సేవలను అందించేందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 1989 లో జర్మనీకి చెందిన కీళ్ల మార్పిడి యంత్ర పరికరాలను బర్డ్ ఆసుపత్రిలో సమకూర్చారు. మోకాలు, తుంటికీలు, భుజం, మోచేయి కీళ్లతో పాటు, రుమటాయిడ్ ఆర్థరైటీస్, ఆస్టియో ఆర్ధరైటీస్ కారణంగా దెబ్బతిన్న 30 వేలకు పైగా రోగులకు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను బర్డ్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాతీయస్థాయిలో ఆర్ఘోపెడిక్ విభాగంలో ఎంపికైన నలుగురు వైద్య విద్యార్థులకు తర్పీదు ను ఇస్తున్నారు.

Updated Date - 2021-10-23T02:11:25+05:30 IST