గడిలో కూలిపోయిన రెండంతస్తుల ఇల్లు

ABN , First Publish Date - 2020-12-06T05:50:59+05:30 IST

కలికిరి మండలంలోని పల్లవోలు పంచాయతీ గడి గ్రామంలో శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో ఓ ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది.

గడిలో కూలిపోయిన రెండంతస్తుల ఇల్లు
నిలువునా కూలిపోయిన బండల మిద్దె

యజమానులు క్షేమం 


కలికిరి, డిసెంబరు 5: కలికిరి మండలంలోని పల్లవోలు పంచాయతీ గడి గ్రామంలో శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో ఓ ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది. ఆ ఇంట్లో నివసిస్తున్న దంపతులు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కొంచెం పాతబడిన బండల మిద్దెపైన రెండు గదులు నిర్మించడంతో వర్షానికి ఇల్లు మొత్తం నిట్టనిలువునా కుప్పకూలింది. బండలు పడడంతో ఇంట్లోని టీవీ, వాషింగ్‌ మిషను, బీరువాలు, మంచాలతో పాటు వివిధరకాల పాత్రలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. రెండంతస్తుల ఇల్లు కుప్పకూలిపోవడంతో గ్రామస్తులంతా పరుగులు తీశారు. దీనికి తోడు ఇంటి పరిసర ప్రాంతాలు చీకటిమయంగా కావడంతో సుమారు గంటపాటు ఊరిలో గందరగోళం నెలకొంది. అసలు ఇంట్లో వున్న వృద్ధులు ఏమయ్యారన్న ఆందోళన కొద్దిసేపు నెలకొంది. అయితే ఇద్దరూ.. సమీపంలోని కుమారుడి ఇంటికి భోజనానికి వెళ్లడంతో క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుని తెరిపినపడ్డారు. కూలిపోయిన ఇంటిని చూసి వృద్ధ దంపతులు గుండెలు బాదుకున్నారు.

Updated Date - 2020-12-06T05:50:59+05:30 IST